భద్రాచలం: భద్రాచలానికి శ్రీనివాసం శ్రీరామ స్వాతి – శ్రీపతి దంపతులు పదేళ్ల క్రితం వచ్చారు. అప్పటి నుంచి పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీపతి తెలుపు, కాషాయ వస్త్రాలు ధరించి, గుబురు గడ్డంతో స్వామిజీలా కనిపించేవారు. ఆ తర్వాత పాత భవనాన్ని కొనుగోలు చేసి అక్కడే ఆలయ నిర్మాణం ప్రారంభించారు. అది పూర్తికాక ముందే జీ ప్లస్ 5 భవన నిర్మాణం మొదలుపెట్టారు. ఆధ్యాత్మిక ముసుగులో అక్రమ కట్టడాలేమిటని ప్రశ్నించిన స్థానికులతో పలుమార్లు తగదా పడ్డారు. భవన నిర్మాణ పనులపై అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజన సంఘాల నేతలతోనూ గొడవ పెట్టుకున్నారు. భవనం కూలిపోయిన తర్వాత ఈ దంపతుల విషయమై స్థానికులను వాకబు చేయగా ఎవరూ పూర్తి వివరాలు చెప్పలేకపోయారు. అయితే, శ్రీపతిని బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నా స్పష్టత రాలేదు.