
పాత కక్షలతోనే ప్రాణం తీశారు
● యువకుడి హత్య కేసులో 8 మంది అరెస్టు
● నిందితుల్లో ఇద్దరు మైనర్లు
● 9 మొబైల్ ఫోన్లు, బైక్ స్వాధీనం
● హతుడిపై పీడీ యాక్ట్, 27 కేసులు
మల్యాల: మండలంలోని ముత్యంపేట దిగువ కొండగట్టులో సంచలనం సృష్టించిన ఉప్పు రమణా రెడ్డి (29) హత్య పాత కక్షలతోనే జరిగినట్లు పోలీసులు తేల్చారు. ఈనెల రెండో తేదీనే హత్య జరిగినప్పటికీ.. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ కేసును పోలీసులు ఛేదించారు. హత్యలో ప్రమేయమున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. సంఘటన వివరాలను మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్లో డీఎస్పీ రఘుచందర్ సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్కుమార్తో కలిసి సోమవారం విలేకరులకు వివరించారు. దిగువ కొండగట్టుకు చెందిన ఉప్పు రమణారెడ్డి అందరిని తరచూ బెదిరిస్తూ.. గొడవలకు దిగేవాడు. కొండగట్టుకు చెందిన బండి సిద్దుతోనూ గతంలో ఘర్షణ పడ్డాడు. ఈనెల 2న సిద్దుకు హల్దీ ఫంక్షన్ ఉండగా.. రమణారెడ్డి అతడి ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. సిద్దుతోపాటు అతని స్నేహితులు చింతలకోటి వినయ్, పస్తం ఈశ్వర్, దాసరి ఆకాశ్, మంచినీళ్ల అజయ్, పంజాల మధు, మరో ఇద్దరు మైనర్లను చంపుతానని బెదిరించాడు. దీంతో సిద్దు, వినయ్, ఈశ్వర్ రమణారెడ్డినే చంపాలని నిర్ణయించుకున్నారు. అదేరోజు రాత్రి సిద్దు, వినయ్ బస్టాండ్ వద్ద ఉన్నారు. అదే సమయంలో రమణారెడ్డి అక్కడికి వెళ్లగా.. వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ విషయాన్ని పంజాల మధు తన స్నేహితుడైన ఈశ్వర్కు ఫోన్లో చెప్పడంతో ద్విచక్రవాహనంపై అక్కడకు చేరుకున్నాడు. మాట్లాడుకుందామని చెప్పి రమణారెడ్డిని బండిపై కూర్చొబెట్టుకొని కొండగట్టు మెట్లదారి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సిద్దు, వినయ్, ఈశ్వర్ రమణారెడ్డిని తీవ్రంగా కొట్టారు. తలపై బండరాయితో మోదారు. అనంతరం ఈశ్వర్ దాసరి అకాశ్, పంజాల మధుకు ఫోన్ చేశాడు. ఆకాశ్ మంచినీళ్ల అజయ్తోపాటు మరో ఇద్దరు మైనర్లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అందరూ కలిసి రమణారెడ్డి శవాన్ని ఉపాధి పథకం కింద తీసిన గుంతలో పడేసి పూడ్చివేశారు.
వెలుగు చూసిందిలా..
రమణారెడ్డి సోదరుడు నిరంజన్ తన తమ్ముడిని ఈనెల 2న కొంతమంది కొట్టి.. చంపి.. పూడ్చివేశారంటూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అనుమానితుల కోసం గాలిస్తుండగా దిగువ కొండగట్టులో ఆంజనేయస్వామి ఆలయం వద్ద సిద్దు అనుమానాస్పదంగా కనిపించాడు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఈశ్వర్, వినయ్ని రైల్వేస్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో మిగిలిన వారి వివరాలు వెలుగుచూశాయని డీఎస్పీ వివరించారు. రమణారెడ్డి తరచూ కొండగట్టుకు వచ్చి అందరిని బెదిరిస్తూ, దాడి చేసేవాడని, భరించలేకే కొట్టి చంపారని నిందితులు విచారణలో చెప్పినట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో ఆరుగురు మేజర్లు, ఇద్దరు మైనర్లు ఉన్నారని, అందరినీ రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 9 మొబైల్ ఫోన్లు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్సై నరేశ్కుమార్, కొడిమ్యాల ఎస్సై సందీప్, ట్రైనీ ఎస్సై రవీందర్ కుమార్, హెడ్కానిస్టేబుల్ మల్లారెడ్డి, కానిస్టేబుళ్లు జనార్ధన్, సురేశ్, వినయ్కుమార్ పాల్గొన్నారు.
రమణారెడ్డిపై 27 కేసులు
హత్యకు గురైన ఉప్పు రమణారెడ్డిపై గతంలో 27 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ పోలీస్స్టేషన్లో పీడీ యాక్టు నమోదై.. ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించాడు. అతడిపై సస్పిషియస్ షీట్ నమోదైనట్లు డీఎస్పీ పేర్కొన్నారు.