
ఆన్లైన్ పేకాటతో అప్పులు
జగిత్యాలక్రైం: ఓ యువకుడు ఆన్లైన్లో పేకాట ఆడి అప్పులపాలయ్యాడు. అప్పుల బాధ భరించలేక గతనెల 28న పురుగుల మందు తాగగా, చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హనుమాన్వాడ సమీపంలో బీరయ్యగుడి వెనుక ప్రాంతానికి చెందిన వరద సాయికుమార్ (28) తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావడంతో చిన్ననాటి నుంచి గారాబంగా పెంచారు. దీంతో సాయికుమార్ ఆన్లైన్ పేకాటకు బానిసై బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. సాయికుమార్ది నిరుపేద కుటుంబం కావడంతో అప్పులు తీర్చేందుకు తల్లిదండ్రులు ఇంటిని తాకట్టుపెట్టి డబ్బులు ఇచ్చారు. కానీ, అతడు అప్పులు చెల్లించకుండా మళ్లీ ఆన్లైన్ పేకాట ఆడడంతో అప్పు ఇచ్చిన వారంతా తీవ్ర ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో గతనెల 28న ఇంట్లో గడ్డిమందు తాగగా, కుటుంబ సభ్యులు గమనించి జగిత్యాల– కరీంనగర్లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా కోలుకోకపోవడంతో మూడురోజుల క్రితం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కిరణ్ తెలిపారు.
ఒత్తిడితో పురుగుల మందు తాగిన యువకుడు
చికిత్స పొందుతూ మృతి