
వేసవి దుక్కి.. పంటకు పుష్టి
● పంట కొయ్యలు కాల్చేస్తే ప్రమాదమే ● తొలకరికి ముందు లోతు దుక్కులు మేలు ● ఏటవాలుగా దున్నితే మరింత శ్రేయస్కరం
కరీంనగర్ అర్బన్: శాస్త్రవేత్తల మాటలు కాకుండా సొంత నిర్ణయాలే పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పంట కొయ్యలు కాల్చకుండా కలియదున్నడం, వేసవిలో లోతు దుక్కులతో ఎంతో ప్రయోజనం. పురుగులు, తెగుళ్లు, కలుపును నివారించుకోవడంతో పాటు భూమిపొరల్లో వర్షపునీరు ఇంకి పంటకు ఉపయోగపడుతుంది. వేసవిలో లోతు దుక్కుల ఉపయోగాల గూర్చి కరీంనగర్ వ్యవసాయ పరిధశోధనస్థానం హెడ్ డీన్ డా.జి.మంజులత వివరించారు. వేసవి దుక్కులకు ఏప్రిల్, మే నెలలు అనుకూలం, వేసవి దుక్కులను అడ్డం, పొడువు సాళ్లతో కాకుండా ఏటవాలుగా దున్నడం శ్రేయస్కరం.
ఏటవాలు దుక్కితో ప్రయోజనాలనేకం
ఏటవాలుగా దున్నడం వల్ల భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. లోతుగా దున్నినపుడు భూమిలోపలి పొరల్లో ఉన్న క్రిమికీటకాలు సూర్యకిరణాలతో చనిపోతాయి. వేసవి దుక్కుల్లో తొలకరి వర్షాలు కురిసినపడు విత్తనాలు వేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. తొలకరి వర్షాలకు ముందే రెండుసార్లు దున్నితే గట్టిగా ఉన్న భూమి గుల్లబారడంతో పాటు కలుపు నివారించుకోవచ్చు. వర్షం నీరు భూమిలోకి చొచ్చుకొనిపోతోంది, భూమి పొరల్లోకి గాలి చేరుతుంది. సూక్ష్మజీవుల సాంద్రత, సేంద్రియ కర్బనం బాగా పెరుగుతుంది. దీంతో భూమిలోని పోషకాలను మొక్క గ్రహించడానికి అనుకూలంగా ఉంటుంది. కలుపు, పురుగు మందుల అవశేషాలకు మొక్కలు తీసుకోవు. భూమి వర్షపునీటిని తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. గాలిలో ఉన్న నత్రజని వర్షపునీటితో కలిసి భూమిలోకి చేరడం వల్ల భూసారం పెరుగుతుంది. పురుగుమందులు, తెగుళ్ల మందులకయ్యే పెట్టుబడిని తగ్గించుకోవచ్చు. హానిచేసే బాక్టీరియాను నాశనం చేయొచ్చు.
వరికొయ్యలు కలియదున్నాలి
వరి కోతలు పూర్తయ్యాక కొయ్యలను తగులబెడుతుంటారు. దీనివల్ల భూమి సారం కోల్పోతుంది. అలా కాకుండా వరి కొయ్యలను నీటిలో నాన్చి దున్నడం లేదా బీడులోనే కలియదున్నితే నేలలో పోషక విలువలు పెరుగుతాయి. పత్తి రైతులు కాల్చివేయకుండా కలియదున్నాలని శాస్త్రవేత్తలు స్పష్టం సూచిస్తున్నారు. ప్రమాదాల నివారణతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాలి.