
జల్సాలకు అలవాటుపడి.. బైక్ చోరీలు
పాలకుర్తి(రామగుండం): జల్సాలకు అలవాటుపడి బైక్ చోరీలు చేస్తున్న ముఠాను శుక్రవారం పట్టుకున్నట్లు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు. బసంత్నగర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ వివరాలు వెల్లడించారు. బసంత్నగర్కు చెందిన చింతకింది సిద్ధార్థ, తుంగ శ్యాం, అంతర్గాం మండలం రాయదండి గ్రామానికి చెందిన తోకల సిద్ధార్థతోపాటు మరో ముగ్గురు బాలురు మంచి స్నేహితులు. జల్సాలకు అలవాటు.. ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురాశతో బైక్ తాళం తీసే టెక్నిక్ తెలుసుకున్నారు. పార్కింగ్ చేసిన బైక్లు చోరీచేస్తున్నారు. ఇటీవల పెద్దపల్లి బస్టాండ్ ప్రాంతంలో పార్క్ చేసిన బైక్ను దొంగిలించారు. ఐటీఐ మిత్రుల ద్వారా పరిచయమైన తోకల సిద్ధార్థకు బైక్లు విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. శుక్రవారం ఈసాలతక్కళ్లపల్లి శివారులో ఎస్సై స్వామి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేస్తుండగా చింతకింది సిద్ధార్థ, తుంగ శ్యాం బైక్పై అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా బైక్ చోరీలు వెలుగులోకి వచ్చాయి. వారిచ్చిన సమాచారంతో మరో ముగ్గురు మైనర్లతో పాటు బైక్లను కొనుగోలు చేస్తున్న తోకల సిద్ధార్థపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం సిద్ధార్థ పరారీలో ఉన్నాడని డీసీసీ తెలిపారు. సిద్ధార్ధ, శ్యామ్ను అరెస్టు చేశామన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచాక్యంగా వ్యవహరించిన ఎస్సై స్వామితోపాటు కానిస్టేబుళ్లు అనిల్, శరత్, శ్రీనివాస్, రవీందర్ను డీసీపీతోపాటు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ అభినందించి నగదు రివార్డు అందజేశారు.
అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
చందుర్తి: రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలోపెద్దపులి సంచరిస్తోందని, అటవీ ప్రాంతం వైపు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని వేములవాడ డిప్యూటీ రెంజ్ అధికారి రాఘవేందర్ రావు సూచించారు. హైకాస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సాయి వైష్ణవ్, సాయి సాహెబ్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని లింగంపేట, మల్యాల, చందుర్తి గ్రామాల ప్రజలకు పులి సంచారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలోకి వెళ్లే ప్రజలు సూర్యుడు అస్తమించే వరకు గ్రామాల్లోకి చేరుకోవాలన్నారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లే అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. మూడు మాసాలుగా ఇదే ప్రాంతంలో పులి సంచారం కొనసాగిస్తుందని చందుర్తి, రుద్రంగి, వేములవాడ రూరల్ మండలాల్లో అటవీ ప్రాంతాలను అనుకుని, జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల, మేడిపల్లి, భీమారం మండలాల్లో అటవీ ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బీట్ అధికారి బాలకృష్ణ, బేస్క్యాంపు సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
గంజాయి విక్రయదారుల అరెస్ట్
ఓదెల(పెద్దపల్లి): పొత్కపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న జాడి కిరణ్, జాడి ప్రకాశ్, గుజ్జుల సాయి, కొమురవెల్లి పవన్, ఇందిబెల్లి సందిప్కుమార్, లింగన్నపేట సందీప్కుమార్ను అరెస్టు చేయగా, మరొకరు ఖేల కుమార్ పరారయ్యాడని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు. పొత్కపల్లి పోలీస్స్టేషన్లో శుక్రవారం పెద్దపల్లి ఏసీపీ కృష్ణతో కలిసి వివరాలు వెల్లడించారు. ఎస్సై రమేశ్, తన సిబ్బందితో రైల్వేస్టేషన్లో తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆరుగురిని పట్టుకున్నారు. వారిని విచారించగా గంజాయి విక్రయించేందుకు వచ్చినట్లు అంగీకరించారు. వారినుంచి గంజాయి, బైక్, రెండు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు గోదావరిఖని పరిసరాలకు చెందిన వారుగా గుర్తించారు. సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై రమేశ్, ఏఎస్సై రత్నాకర్, హెడ్కానిస్టేబుల్ కిషన్, పీసీ రాజేందర్ పాల్గొన్నారు. గంజాయి విక్రయదారులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై రమేశ్, సిబ్బందిని డీసీపీ. ఏసీపీ అభినందించారు.
గునుకులపల్లెలో అగ్నిప్రమాదం
చిగురుమామిడి: మండలంలోని గునుకులపల్లెలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో వరి కొయ్యలకు నిప్పుపెట్టగా తీవ్రస్థాయిలో మంటలు చెలరేగి చిగురుమామిడి సింగిల్విండో వైస్చైర్మన్ కరివేద మహేందర్రెడ్డికి చెందిన మామిడిచెట్లు దగ్ధమయ్యాయి. అలాగే లేగదూడ మంటల్లో చిక్కుకోవడంతో చర్మం కాలిపోయింది. లేగదూడ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని రైతు వాపోయాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రైతుపై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరాడు.

జల్సాలకు అలవాటుపడి.. బైక్ చోరీలు

జల్సాలకు అలవాటుపడి.. బైక్ చోరీలు