
జీవాల దాహం తీర్చుతున్న బల్దియా
అధికారులను కదిలించిన ‘సాక్షి’ కథనం
కోల్సిటీ(రామగుండం): వేసవిలో నీటికోసం అల్లాడుతున్న మూగజీవాల దీనస్థితిపై ‘సాక్షి’ శుక్రవారం ప్రచురించిన ‘జీవాల దాహం తీర్చుదాం’ కథనం బల్దియా అధికారులను కదిలించింది. గతేడాది వేసవిలో మూగజీవాల కోసం నగరంలోని 90చోట్ల నీటితొట్టెలు ఏర్పాటు చేసిన అధికారులు.. ఈ వేసవిలో అందులో నీళ్లు నింపకుండా నిర్లక్ష్యం చేశారు. దీనిపై కథనం ప్రచురించగా బల్దియా కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ స్పందించారు. నీటితొట్టెలను గుర్తించి ప్రతీరోజు నీళ్లు నింపాలని ఆదేశించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం నేతృత్వంలో నగరంలోని తొట్టెల్లో శుక్రవారం సిబ్బందితో నీటిని నింపించారు. జీవాల దాహం తీర్చడానికి ‘సాక్షి’ తీసుకున్న చొరవను పలువురు అభినందించారు.
బాధ్యులను అరెస్టు చేయాలి
● పోలీస్స్టేషన్ ఎదుట మృతుడి బంధువుల ఆందోళన
జగిత్యాలక్రైం: భూ కబ్జా చేశారని మనస్తాపం చెంది గురువారం ఆత్మహత్య చేసుకున్న పడిగెల మల్లారెడ్డి బంధువులు శుక్రవారం రూరల్ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని నిరసన వ్యక్తం చేశారు. మృతుడి కుమార్తె శరణ్య పురుగుల మందు డబ్బా తెచ్చుకోవడంతో బంధువులు డబ్బాను లాక్కొని పడేశారు. దీంతో స్పందించిన డీఎస్పీ రఘుచందర్ హత్య కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
పొరండ్లలో భారీ బందోబస్తు
మృతుడి బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో పోలీసులు ముందస్తుగా పొరండ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అంత్యక్రియలు పూర్తి చేశారు.
విశ్వంలోనే మొట్టమొదటి పాత్రికేయుడు నారద మహర్షి
కరీంనగర్టౌన్: ముల్లోకాలు సంచరించి లోక కల్యాణం కోసం సమాచార రంగాన్ని వికసింపజేసిన మొట్టమొదటి పాత్రికేయుడు, ఖగోళ జర్నలిస్ట్ నారద మహర్షి అని తెలంగాణ ప్రాంత గ్రామ వికాస ప్రముఖ్ జిన్నా సత్యనారాయణరెడ్డి అన్నారు. సమాచార భారతి కరీనగర్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని వాగేశ్వరి డిగ్రీ, పీజీ కళాశాలలో దేవర్షి నారద జయంతి(జర్నలిస్ట్ దినోత్సవం) వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నారద మహర్షిని మొట్టమొదటి పాత్రికేయుడిగా పరిగణిస్తూ ప్రతి సంవత్సరం నారద జయంతిని ప్రపంచ పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం తర్వాత అత్యంత శక్తివంతమైన స్థానం మీడియా రంగం, పాత్రికేయులకే దక్కుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ బాధ్యులు పాక సత్యనారాయణ, తడగొప్పుల శంకరయ్య, గీకూరి శ్రీనివాస్, సమాచార భారతి బాధ్యులు వేణుగోపాల్, విమల్, పైడిపల్లి శ్రీనివాస్, ఓదెల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో ప్లంబర్ దుర్మరణం
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని సుభాష్నగర్లో ఇంటినిర్మాణం పనుల్లో ప్లంబింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై గజ్జల శ్రీనివాస్(45) దుర్మరణం చెందాడు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన శ్రీనివాస్ ఒంటరిగానే పెద్దపల్లిలో నివాసముంటూ ప్లంబర్గా పనులు చేస్తుంటాడని ఎస్సై లక్ష్మణ్రావు తెలిపారు. మృతుడి కూతురు వైష్ణవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

జీవాల దాహం తీర్చుతున్న బల్దియా

జీవాల దాహం తీర్చుతున్న బల్దియా

జీవాల దాహం తీర్చుతున్న బల్దియా