
విద్యుత్ మోటారు దొంగల అరెస్ట్
ఓదెల(పెద్దపల్లి): మద్యానికి బానిసై, బెట్టింగ్లకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో విద్యుత్ పంపుసెట్లు చోరీచేస్తున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. పొత్కపల్లి పోలీస్స్టేషన్లో శనివారం పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ వివరాలు వెల్లడించారు. ఓదెల గ్రామానికి చెందిన సిరిగిరి ప్రసాద్, అంగిడి సాయికుమార్ కొంతకాలం క్రితం మద్యానికి బానిసయ్యారు. బెట్టింగ్లు పెడుతున్నారు. జల్సాలకు అలవాటుడపడ్డారు. చేతిలో డబ్బు లేకపోవడంతో కరెంట్ మోటార్లు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్, పొత్కపల్లి, సుల్తానాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలో వ్యవసాయబావుల వద్ద ఏర్పాటు చేసుకున్న కరెంట్ మోటర్లు, సర్వీసువైర్లను దొంగిలించారు. ఇందుకోసం ఆటోలో తిరుగుతున్నారు. ఈక్రమంలో పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. నిఘా తీవ్రతరం చేశారు. దీంతో శనివారం ఎస్సై రమేశ్ వాహనాలను తనిఖీ చేస్తుండగా 39 కరెంట్ మోటార్లు, సర్వీసు వైర్లు, ఆటోట్రాలీ లభించగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాచాపూర్, కోనరావుపేట, రూపునారాయణపేట, కొలనూర్, శివపల్లి, మడిపల్లి గ్రామాల్లో వీటిని చోరీ చేసినట్లు నిందితులు తెలిపారు. ఇందుకు బాధ్యులైన సిరిగిరి ప్రసాద్, అంగిడి సాయికుమార్ను అరెస్టు చేసి, విద్యుత్ మోటార్లతో పాటు ఆటోట్రాలీ, సర్వీసు వైర్లు..మొత్తంగా రూ.10,67,500 విలువైన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పొత్కపల్లి ఎస్సై రమేశ్ పాల్గొన్నారు. కాగా, దొంగలను పట్టుకున్న ఎస్సై రమేశ్, ఏఎస్సై అశోక్, హెడ్కానిస్టేబుళ్లు కిషన్, ప్రవళిక, కానిస్టేబుళ్లు రాజేందర్, వెంకటేశ్, రవి, రాజు, శివశంకర్, శంకర్, రామకృష్ణ, అశోక్, సతీశ్, రజిత, దనలక్ష్మి, తేజస్వీనికి డీసీపీ, ఏసీపీ రివార్డులు అందజేశారు.
39 వ్యవసాయ పంపుసెట్లు, సర్వీసు వైర్లు స్వాధీనం
పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ వెల్లడి