నేడు ఇందూరుకు అమిత్‌ షా | - | Sakshi
Sakshi News home page

నేడు ఇందూరుకు అమిత్‌ షా

Jun 29 2025 2:32 AM | Updated on Jun 29 2025 2:32 AM

నేడు ఇందూరుకు అమిత్‌ షా

నేడు ఇందూరుకు అమిత్‌ షా

సుభాష్‌నగర్‌: జిల్లా కేంద్రానికి నేడు (ఆదివారం) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రానున్నారు. పసుపు రైతుల దశాబ్దాల కల అయిన పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అమిత్‌ షా పర్యటన సందర్భంగా ఏర్పాట్లు, ఇతర అంశాలపై కలెక్టర్‌, సీపీ సహా పసుపు బోర్డు అధికారులతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. మరోవైపు ఎంపీ అర్వింద్‌ ధర్మపురి, పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి సైతం బీజేపీ శ్రేణులు, రైతు సంఘాలతో చర్చిస్తున్నారు. అమిత్‌ షా పర్యటన ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. నగరంలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. డీఎస్‌ ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని కంఠేశ్వర్‌ బైపాస్‌ చౌరస్తాలో కాంస్య విగ్రహాన్ని అమిత్‌ షా ఆవిష్కరించనున్నారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం అనంతరం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో నిర్వహించే కిసాన్‌ సమ్మేళన్‌(రైతు సమ్మేళనం) బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొననున్నారు.

కేంద్ర హోంమంత్రి పర్యటనను బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని జిల్లాలతోపాటు నిర్మల్‌, కామారెడ్డి తదితర జిల్లాల నుంచి రైతులు, పార్టీ శ్రేణులను తరలించేలా ఏర్పాట్లు పూర్తిచేశారు. ముఖ్యంగా పసుపు రైతులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతు సమ్మేళన కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఒకవేళ వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి

బైపాస్‌ చౌరస్తాలో పీసీసీ మాజీ చీఫ్‌

డీఎస్‌ విగ్రహావిష్కరణ..

పాలిటెక్నిక్‌ మైదానంలో కిసాన్‌ సమ్మేళన్‌

ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎంపీ అర్వింద్‌, పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి

పర్యటన షెడ్యూల్‌..

అహ్మదాబాద్‌(గుజరాత్‌) ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం ఉదయం బయల్దేరి హైదరాబాద్‌లోని బేగంపేట్‌కు అమిత్‌ షా చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీక్యాప్టర్‌ ద్వారా జిల్లాకేంద్రానికి మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుంటారు. 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన అనంతరం బస్వాగార్డెన్‌లో పసుపు బోర్డు అధికారులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 3.30 గంటలకు డీఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి, పాలిటెక్నిక్‌ మైదానంలో నిర్వహించే రైతు సమ్మేళనంలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు బహిరంగ సభాప్రాంగణం నుంచి హెలీప్యాడ్‌ వద్దకు బయల్దేరుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement