
పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ
బీబీపేట: పామాయిల్ సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించి వారిని సాగు చేసేందుకు సన్నద్ధం చేశాయి. జిల్లా వ్యాప్తంగా రైతులు పామాయిల్ సాగు చేసేందుకు ఇప్పటికే చాలా మంది ముందుకు వచ్చారు. సాగుకు అనువైన పరిస్థితులు ఉండడంతో అధికారులు కూడా రైతులను పూర్తిగా అవగాహన కల్పించారు. అంతే కాకుండా ఉద్యానవన శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రచారం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 1,706 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం మరో 2,500 ఎకరాల్లో పామాయిల్ తోటలను పెంచేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. పామాయిల్ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనువైన జిల్లాగా కామారెడ్డిని గుర్తించింది. దీంట్లో భాగంగానే గత సంవత్సరం నుంచే రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎవరికై తే సాగు చేయాలనే ఉద్దేశం ఉందో ఆ రైతుల వద్ద నుంచి సంబంధిత పత్రాలను సేకరించారు. జిల్లాలో పామాయిల్ కంపెనీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా వచ్చాయి. అందుకు అనుగుణంగా 10 ఎకరాల స్థలం కోసం అధికారులు, పామాయిల్ కంపెనీ వారు చూస్తున్నారు. స్థలాన్ని కేటాయించినట్లయితే కంపెనీ నిర్మాణానికి కూడా ముందుకు రానున్నట్లు తెలిసింది.
ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీ..
బిందు సేద్య పరికరాలపై ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, సన్న చిన్న కారు రైతులకు 90 శాతం, మిగతా రైతులకు 80 శాతం రాయితీ ఉంటుంది. అయితే యూనిట్ ధరపై 7 శాతం లేదా, రూ.5 వేలు జీఎస్టీని రైతులే చెల్లించాలి. జనరల్, బీసీ రైతుకు 90 శాతం రాయితీ పోను మిగిలిన మొత్తంతో పాటు జీఎస్టీని చెల్లించాలి. డ్రిప్పై హెక్టారుకు యూనిట్ ధర రూ. 47,065 (మైక్రోజెట్స్), కాగా ఎమిటర్స్, మైక్రోజెట్స్ కలిపి యూనిట్ ధర రూ. 47,805 ఉంటుందని అధికారులు తెలిపారు.
మొక్కలపై రాయితీ..
పామాయిల్ సాగుకు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది. సాగుకు బీసీలకు 90 శాతం సబ్సిడీ, ఓసీలకు 80 శాతం సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీ రైతులు.. పామాయిల్ మొక్క ఖరీదు రూ.400 కాగా వారు మొక్కకు రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఎకరంలో నాటాల్సిన మొక్కలు 50 కాగా రూ. వెయ్యి బ్యాంకు డీడీ తీయాల్సి ఉంటుంది. అలాగే పంట సాగు చేసిన నాలుగేళ్ల పాటు ప్రోత్సాహకాలు అందిస్తుంది.
పామాయిల్ సాగుకు ముందుకు వస్తున్న రైతులు
జిల్లాలో ఇప్పటికే సుమారు 1,706 ఎకరాల్లో సాగు
పామాయిల్తో పాటు అంతర
పంటలకు అవకాశం
జిల్లాలో పామాయిల్ కంపెనీ
ఏర్పాటుపై రైతుల ఆశలు
పామాయిల్ తోటలు పెంచుకోవాలి
జిల్లాలో పామాయిల్ సాగుపై రైతులకు ఇప్పటికే కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్పించాం. అంతే కాకుండా రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఎక్కువ సంవత్సరాలు ఆదాయం పొందేందుకు ఆయిల్పామ్ సాగు రైతులకు బాగా ఉపయోగపడుతుంది. ఎకరానికి 50 మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు రైతులు నాలుగేళ్ల పాటు తీసుకుంటే తర్వాత ఆదాయం వస్తుంది.
– జ్యోతి, జిల్లా ఉద్యాన శాఖాధికారి, కామారెడ్డి

పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ