
బోనస్ ఎప్పుడిస్తరో?
సర్కారు గత ఖరీఫ్ సీజన్లో సన్నరకం వడ్లకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ ఇవ్వడంతో చాలామంది రైతులు రబీలోనూ సన్నరకాలు పండించారు. అయితే కొనుగోళ్లు పూర్తై నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటికీ బోనస్ ఊసెత్తడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కామారెడ్డి క్రైం : రైతులు పండించిన వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ అందిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక సన్నరకం వడ్లకే బోనస్ ఇస్తామని పేర్కొంది. దీంతో పలువురు రైతులు బోనస్పై ఆశతో సన్నరకాల సాగుకు మొగ్గు చూపారు. గత ఖరీఫ్ సీజన్లో సర్కారు సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ అందించింది. ధాన్యం డబ్బులతో పాటే ఒకటి రెండు రోజులు అటూఇటుగా బోనస్ కూడా రైతుల బ్యాంకు ఖాతాలలో జమయ్యింది. దీంతో బోనస్పై ఆశతో అన్నదాతలు రబీలోనూ సన్నరకాలు పండించారు. జిల్లాలో రబీ సీజన్కు సంబంధించిన వడ్ల సేకరణ పూర్తై నెల రోజులు కావొస్తోంది. ఇప్పటికీ బోనస్ డబ్బులు రైతులకు అందలేదు.
72,852 మంది రైతుల ఎదురుచూపు..
జిల్లాలో ప్రధాన పంట వరి. గతంలో రైతులు ఎక్కువగా దొడ్డు రకాలనే సాగు చేసేవారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తామనడంతో ఈ మధ్య సన్నాల వైపు మళ్లారు. యాసంగిలో సన్నాల సాగుకంటే దొడ్డు రకాలే దిగుబడి ఎక్కువగా వస్తాయి. కానీ బోనస్పై ఆశతో సన్నరకాలు వేశారు. జిల్లావ్యాప్తంగా రైతులు యాసంగి సీజన్లో 2,61,110 ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఇందులో దాదాపు 60 వేల ఎకరాల్లో సన్నాలున్నాయి. ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం 446 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఇందులో 63 కేంద్రాలను ప్రత్యేకంగా సన్నరకం ధాన్యం సేకరణకే కేటాయించారు. మార్చి నెలాఖరు నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. దొడ్డు, సన్నరకాలు కలిపి 3.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తరలించారు. దీంట్లో 1,78,416 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం ఉంది. సేకరించిన ధాన్యానికి సంబంధించి (మద్దతు ధర) రూ. 886 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. బోనస్ డబ్బులు రూ. 89 కోట్లు ఇప్పటికీ విడుదల చేయలేదు. కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వడ్లు విక్రయించిన మొత్తం 72,852 మంది రైతులు బోనస్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం బోనస్ చెల్లించకపోతే రైతులు మళ్లీ పాత పద్ధతిలో దొడ్డు రకాల సాగుపైనే దృష్టి పెట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
యాసంగి ‘భరోసా’ రాలే!
ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించి పూ ర్తిస్థాయిలో రైతు భరోసా చెల్లించలేదు. నాలుగెకరాలలోపు రైతులకు మాత్రమే పెట్టుబడి సా యం అందింది. నాలుగెకరాలపైన భూమి ఉ న్న రైతులకు ఇప్పటికీ రైతు భరోసా ఇవ్వలేదు. జిల్లాలో 56 వేల మంది రైతులకు సంబంధించి దాదాపు రూ.100 కోట్ల పెట్టుబడి సాయం రా వాల్సి ఉంది. ఓవైపు యాసంగి పెట్టుబడి సా యం అందక, మరోవైపు సన్నాలకు బోనస్ రా క సదరు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ తీరుపై వారిలో అసహనం వ్యక్తమవు తోంది. ఇప్పటికై నా సర్కారు స్పందించి రైతు భరోసాతోపాటు బోనస్ డబ్బులు ఖాతాలలో జమ చేయాలని కోరుతున్నారు.
ధాన్యం సేకరణ పూర్తై నెల..
ఇప్పటికీ పత్తాలేని ప్రోత్సాహకం
జిల్లాకు రావాల్సింది రూ. 89 కోట్లు
నిరాశలో అన్నదాతలు

బోనస్ ఎప్పుడిస్తరో?