
జొన్న కొనుగోలు కేంద్రం పరిశీలన
పెద్దకొడప్గల్: మండల కేంద్రంలోని సొసైటీలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం మార్క్ఫెడ్ రాష్ట్ర మేనేజర్ చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నీ బస్తాలను విడతల వారీగా పంపుతున్నామన్నారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ డీఎం మహేష్ కుమార్, సొసైటీ చైర్మన్ హన్మంత్ రెడ్డి, కార్యదర్శి సందీప్ తదితరులు పాల్గొన్నారు.
ఈవోపై చర్యలకు సిఫారసు
భిక్కనూరు: శ్రీసిద్దరామేశ్వరాలయంలో హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన ఎల క్ట్రీషియన్ లక్ష్మీనారాయణకు నామమాత్రపు నోటీసు ఇచ్చిన ఈవో శ్రీధర్పైనా చర్యలు తీసుకోవాలని ఆర్జేసీకి సిఫారసు చేసినట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామరావు తెలిపారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. పేరు, లేఖ నంబర్ లేకుండా సంజాయీషీ నోటీస్ ఇవ్వడం, ఆ నోటిస్లో ఉన్నతాధికారులకు ప్రతులు పెట్టకపోవడం ఈవో నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. దేవాలయాలను అప్రతిష్టపాలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన ఎలక్ట్రీషియన్పై శాఖాపరమైన చర్యలతో పాటు పోలీసు కేసు కూడా పెట్టాలని ఈవోను ఆదేశించామన్నారు.
7 వరకు విద్యుత్ భద్రత వారోత్సవాలు
కామారెడ్డి అర్బన్: జిల్లాలో ఈనెల 7వ తేదీ వరకు విద్యుత్ భద్రత వారోత్సవాలు నిర్వహించనున్నట్టు ఎస్ఈ శ్రావణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ ప్రమాదాల నివారణ, విద్యుత్ పొదుపు, రైతుల భద్రత, సులభంగా సేవలు పొందడం, టోల్ఫ్రీ నంబర్ –1912 పై వినియోగదారులను చైతన్యం చేయడం కోసం వారోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
5 నుంచి జిల్లా స్థాయి వేసవి శిబిరం
కామారెడ్డి టౌన్: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు టేక్రియాల్ కేజీబీవీలో విద్యార్థినులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డీఈవో రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంగీతం, నృత్యం, గణితం, స్పోకెన్ ఇంగ్లిష్, చిత్ర లేఖనం, కంప్యూటర్ స్కిల్స్, ఆటలు, యోగా తదితర అంశాలలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాలకు టేక్రియాల్లోని కేజీబీవీలో ఈనెల 5తేదీలోపు సంప్రదించాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: జిల్లాలో ర్యాంప్ పథకం అమలు కోసం మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయనున్నట్లు జిల్లా పరిశ్రమల అధికారి లాల్సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో గానీ, ఎంఎస్ఎంఈ వెబ్సైట్లోగాని సంప్రదించాలని సూచించారు.
విచారణ జరిపిస్తాం :
రామారెడ్డి ఎంపీడీవో
రామారెడ్డి: మండలంలోని కన్నాపూర్ గ్రామంలో శవాలను పూడ్చే చోట ఉపాధి హామీ పనులు అనే శీర్షికన గురువారం ప్రచురితమైన కథనంపై రామారెడ్డి ఎంపీడీవో తిరుపతిరెడ్డి స్పందించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పని కల్పించడానికి ఉపాధి హామీ మేట్ కూలీల వద్ద డబ్బులు డిమాండ్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దీనిపై విచారణ జరుపుతామన్నారు.

జొన్న కొనుగోలు కేంద్రం పరిశీలన