
‘దయానందుడు చూపిన మార్గం ఆచరణీయం’
కామారెడ్డి అర్బన్ : ఆర్య సమాజ స్థాపకులు మహర్షి దయానంద సరస్వతి చూపిన మార్గం ఎంతో ఆచరణీయమైందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి ఆర్య సమాజం స్వర్ణోత్సవాలను ఆదివారం జిల్లాకేంద్రంలోని శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. 108 కుండాలతో గాయత్రి మహాయాగం జరిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కామారెడ్డి ఆర్యసమాజం 50 ఏళ్లుగా వేద ధర్మాన్ని ప్రచారం చేస్తూ సమాజ ఉద్ధరణకు పాటుపడుతుండడం అభినందనీయమన్నారు. ఆర్యసమాజం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆర్యసమాజం బాధ్యతలను యువతకు అప్పగించాలని సూచించారు. ఆర్ష గురుకులం అధిపతి బ్రహ్మానంద సరస్వతి, కోల్కతాకు చెందిన మహేంద్రపాల్ ఆర్య మాట్లాడుతూ ప్రతిఒక్కరు దేశభక్తి కలిగి ఉండాలని, వేదమార్గంలో పయనించాలని సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్యప్రతినిధి సభ కార్యదర్శి హరికిషన్ వేదాలంకార్, కామారెడ్డి ఆర్యసమాజం అధ్యక్షుడు కంకణాల కిషన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే నేరెళ్ల ఆంజనేయులు, ఆర్యసమాజం ప్రతినిధులు గరిపల్లి అంజయ్యగుప్తా, గడ్డం రాంరెడ్డి, అర్వపల్లి రమేష్, నందనం కృపాకర్, ఆచార్య సత్యవీర్, దోమకొండ అరుణ, వంగాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బాహుబలి దివ్యవాణి గ్రంథం..
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్యసమాజం స్వర్ణోత్సవాలను ఆదివారం జిల్లాకేంద్రంలోని సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా తూంపల్లికి చెందిన మర్రి కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన స్టాల్ అందరినీ ఆకర్షించింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథం దివ్యవాణి నాలుగు వేదాల గ్రంథాన్ని ప్రదర్శించారు. 24 కిలోల బరువున్న వేదాల గ్రంథం వెల రూ. 24వేలని మర్రి కృష్ణారెడ్డి తెలిపారు. 4 వేల పేజీలతో 15/20 సైజులో ఈ గ్రంథం ఉంది. నాలుగు వేదాలను సులభమైన భాషలో అనువదించినట్లు మర్రి కృష్ణారెడ్డి తెలిపారు.

‘దయానందుడు చూపిన మార్గం ఆచరణీయం’