
ధాన్యం కుప్పలు.. వాహనదారులకు తిప్పలు
ఎల్లారెడ్డిరూరల్: రైతులు పండించిన పంటలను కల్లంలో ఆరబెట్టాల్సి ఉన్నప్పటికి ప్రధాన రహదారులపై ఆరబెట్టడంతో పాటు పక్కన పెద్ద పెద్ద బండరాళ్లు ఉంచడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కల్పిస్తున్నా రైతులు పెడచెవిన పెడుతున్నారు. ఈ కారణంగా రాత్రివేళల్లో వరి కుప్పలు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండా, లక్ష్మాపూర్ గ్రామాలలో ప్రధాన రహదారులపై ధాన్యం ఆరబెట్టడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి రోడ్లపై పంటల నూర్పిడి చేయకుండా, ధాన్యం ఆరబెట్టకుండా తగిన చర్యలను తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
ఆరబెట్టకుండా చర్యలు తీసుకోవాలి
రోడ్డుపై ధాన్యం ఆరబెట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ధాన్యం ఆరబెట్టకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా బైకుపై వెళ్లేవారు గాయాలపాలవుతున్నారు. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రోడ్డుపై ధాన్యం ఆరబెట్టకుండా చూడాలి.
– విజయ్ కుమార్, లింగంపేట
కల్లాల్లోనే ఆరబెట్టుకోవాలి
రైతులు ధాన్యాన్ని కల్లాల్లోనే ఆరబెట్టుకోవాలి. రోడ్డుపై ధాన్యం ఆరబెట్టుకోవడం సరికాదు. ధాన్యం కుప్పల మీద రాళ్లు పెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అనుకోని ప్రమాదాలు జరిగితే దానికి పూర్తి బాధ్యులు ధాన్యం ఆరబెట్టిన వారవుతారు.
– మహేష్, ఎస్సై, ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి మండలంలో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
పట్టించుకోని అధికారులు