
కేసీఆర్ వెంటే..
‘తెలంగాణ’లోనూ..
● తెలంగాణ కోసం బీఆర్ఎస్తో
కలిసి నడిచిన జిల్లావాసులు
● రాష్ట్రమొచ్చాకా కారుకే మద్దతు
● పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రం కోసం 2001 లో డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి గులాబీ జెండా అందుకుని కదనరంగాన దూకిన కేసీఆర్కు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పల్లెలన్నీ ఆయన వెంట నడిచాయి. కరీంనగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివెళ్లారు. కామారెడ్డి న్యాయవాదులు అప్పటి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తిర్మల్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కోసం తొలి తీర్మానం చేసి కరీంనగర్ సభకు వెళ్లారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలోనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గా ల్లో మెజారిటీ మండలాల్లో గులాబీ జెండా ఎగిరింది. ఉమ్మడి జిల్లా పరిషత్ను ఆ పార్టీ కై వసం చేసుకుంది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్తో బీఆర్ఎస్ పొత్తుపెట్టుకుంది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి ప్రాంతంలోని అన్ని అసెంబ్లీ స్థానాలతోపాటు ఒక పార్లమెంట్ స్థానం కూడా కూటమే గెలుచుకుంది. 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీలు మహాకూటమిగా ఏర్పడి క్లీన్ స్వీప్ చేశాయి. అప్పటి సీఎం వైఎస్సార్ మరణానంతరం తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం మరోమారు ఊపందుకుంది. ఉద్యమ తీవ్రత పెరగడంతో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్ సింధేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకున్నారు. 2010లో కామారెడ్డి, బాన్సువాడలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులుగా గోవర్ధన్, పోచారం పోటీచేసి గెలిచారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే 2014 లో జరిగిన ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక ఎంపీ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. 2018 ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో మాత్రమే గులాబీ పార్టీ ఓడిపోయింది. అనంతరం రాజకీయ పరిణామాలతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ గూటికి చేరారు. జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకుంది. కామారెడ్డి జిల్లా ఏర్పాటైన తర్వాత తొలి జెడ్పీ పీఠం, మండలాలు, మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ గెలుచుకుంది. 2023 ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్ ఓటమి చెందారు. ఎల్లారెడ్డి, జుక్కల్లలోనూ పరాజయం తప్పలేదు. బాన్సువాడలో గులాబీ జెండా ఎగిరినా.. కొద్ది కాలానికే పోచారం కాంగ్రెస్ గూటికి చేరారు.