
భూ భారతితో సమస్యల పరిష్కారం
గాంధారి/సదాశివనగర్: భూ భారతితో రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. బుధవారం గాంధారి, సదాశివనగర్ రైతువేదికలలో నిర్వహించిన భూభా రతి అవగాహన సదస్సులలో ఆయన పాల్గొన్నారు. భూ భారతి చట్టం గురించి ప్రజలకు వివరించారు. భూముల సమస్యల పరిష్కారం కోసం రెండంచెల వ్యవస్థ ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాదాబైనామాలపై కొనుగోలు చేసిన వ్యవసాయ భూముల సమస్యలను క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంటుందన్నారు. 2014 ముందు సాదాబైనామాలపై కొనుగోలు చేసి, అక్టోబర్ 2020 లో క్రమబద్ధీకరణ కోసం చేసిన దరఖాస్తులను సంబంధిత ఆర్డీవోలు పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరిస్తారన్నారు. అలాగే రైతులకు ఆధార్ తరహాలో భూధార్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. కార్యక్రమాలలో గాంధారి మండల ప్రత్యేకాధికారి మురళి, తహసీల్దార్లు రేణుక చౌహాన్, గంగాసాగర్, ఎంపీడీవోలు రాజేశ్వర్, సంతోష్కుమార్, సదాశివనగర్ ఏవో ప్రజాపతి, నాయకులు శ్రీనివాస్రెడ్డి, కమలాకర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఆధార్ తరహాలో
భూధార్ కార్డులు ఇస్తాం
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్