పల్లెల్లో కానరాని ‘పల్లె వెలుగులు’ | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో కానరాని ‘పల్లె వెలుగులు’

May 22 2023 1:04 AM | Updated on May 22 2023 1:04 AM

ఆటోలో వెళ్తున్న సింగితం గ్రామ ప్రజలు - Sakshi

ఆటోలో వెళ్తున్న సింగితం గ్రామ ప్రజలు

నిజాంసాగర్‌(జుక్కల్‌): ‘పల్లె, పల్లెకు ప్రగతి రథం’ పేరిట ఆర్టీసీ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. ఆచరణలో మాత్రం అమలు సాధ్యం కావడం లేదు. పల్లెలకు ‘పల్లె వెలుగు’లు రాకపోవడంతో ప్రజలు ప్రయివేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అయినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు..

ఆర్టీసీ ఆదాయానికి గండి..

బాన్సువాడ ఆర్టీసీ డిపో పరిధిలోని బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, జుక్కల్‌ నియోజకవర్గంలోని జుక్కల్‌, మద్నూర్‌, డోంగ్లి, బిచ్కుంద, పెద్దకొడప్‌గల్‌, పిట్లం, నిజాంసాగర్‌ మండలాల్లోని పల్లెల్లో ప్రజా రవాణాలో ప్రయివేట్‌ వాహనాలు జోరు కొనసాగుతోంది. మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు ఆటోలు, జీపులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రయివేట్‌ వాహనాలు ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నా.. ఆర్టీసీ అధికారులు ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రయివేట్‌ డ్రైవర్లు తమ వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణికులను తరలిస్తూ, ప్రమాదాలకు దారితీస్తున్నారు. అయినా గత్యంతరం లేక ప్రయాణికులు ప్రయివేట్‌ వాహనాలను వినియోగించాల్సి వస్తోంది.

ప్రతి గ్రామానికి నడుపుతాం..

బాన్సువాడ ఆర్టీసీ డిపో పరిధిలో 257 గ్రామాలకు గాను 211 గ్రామాలకు ఆర్టీసీ కనెక్టివిటి ఉంది. పల్లె, పల్లెకు ప్రగతి రథం ఉన్నా.. ప్రయాణికులు ప్రయివే ట్‌ వాహనాలను ఆశ్రయిస్తుండటంతో ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతుంది. మారుమూల గ్రామాలు కాకుండా ప్రధాన రూట్లల్లో ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో కాకుండా ప్రయివేట్‌ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. ప్రయివేట్‌ వాహనాలను పక్కన పెడితే ప్రతీ గ్రామానికి బస్సు సర్వీసులు నడుపుతాం.

– సదాశివ, ఆర్టీసీ డీఎం, బాన్సువాడ

ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్న గ్రామీణులు

పట్టించుకోని ఆర్టీసీ అధికారులు

బస్సులు రాని గ్రామాలు ఇవే..

నిజాంసాగర్‌ మండలంలోని తెల్గాపూర్‌, సింగితం, తున్కిపల్లి, బూర్గుల్‌, గున్కుల్‌, నర్వ, జక్కాపూర్‌ గ్రామాలు, పిప్పిరేగడి తాండ, మల్లూర్‌ తాండ గ్రామాలకు ఆర్టీసీ బస్సులు లేవు. మిగితా గ్రామాలకు బస్సు సర్వీసులు ఉన్నా పాఠశాలల సమయంలో మాత్రం బస్సులు నడుస్తున్నాయి. పిట్లం మండలంలోని కంబాపూర్‌, అన్నారం, కిష్టాపూర్‌, బ్రహ్మణపల్లి,పోతిరెడ్డిపల్లి గ్రామాలకు బస్సులు రావడం లేదు. పెద్దకొడప్‌గల్‌ మండలంలోని వడ్లం, బేగంపూర్‌, కాస్లాబాద్‌, పెద్దదేవిసింగ్‌తండా, కుభ్యానాయక్‌తండా, కాటేపల్లి, పోచారం, శివ్వాపూర్‌, విఠల్‌వాడి గ్రామాలకు బస్సులు లేవు. బిచ్కుంద మండలంలోని హస్గుల్‌, ఖద్గాం, గోపన్‌పల్లి, మొక్క, చిన్నదడ్గి, మానేపూర్‌, శాంతాపూర్‌, తక్కడ పల్లిగ్రామాలకు బస్సులు లేవు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బస్సులు రాని గ్రామాలకు, మారుమూల పల్లెలకు బస్సు సర్వీసులు నడపాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement