భర్తను హత్య చేసిన భార్య
ప్రియుడితో కలసి పరారీ
బిక్కవోలు: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడదేర్చింది ఆ ఇల్లాలు. సీఐ వీఎల్వీకే సుమంత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బిక్కవోలు గ్రామంలోని కెంగం శ్రీను (43) లారీ క్లీనర్గా పనిచేస్తున్నారు. స్థానిక జగనన్న లే అవుట్ ప్లాట్ నంబర్ 59లో భార్య దేవితో కలసి కాపురం చేస్తున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కాగా పెద్దవాడు సురేంద్ర సత్యకుమార్ నర్సాపురం మండలం సీతారామపురంలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండో కుమారుడు యశ్వంత్కుమార్ పోలవరం మండలం గుటాల గ్రామంలో తాపీ పని చేస్తుంటాడు.
దేవి బిక్కవోలులో అంబటి పేట ప్రాంతానికి చెందిన జంపా దుర్గారావుతో వివాహేతర సంబంధం నెరపుతుండడంతో ఆ భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తల్లి వివాహేతర సంబంధాన్ని చూస్తూ ఉండలేక చిన్న కుమారుడు గుటాలలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి పని చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మళ్లీ శ్రీను, దేవి ఘర్షణపడ్డారు. ఈ ఘర్షణలో శ్రీను మృతి చెందాడు. బుధవారం ఉదయం శ్రీను తల్లి సరస్వతి ఇంటికి రాగా విగతజీవుడై పడి ఉన్న శ్రీనును చూసి కన్నీరుమున్నీరైంది.
అనంతరం దేవి తన ప్రియుడు దుర్గారావుతో కలసి శ్రీనును చంపినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీఎస్పీ శ్రీవిద్య, సీఐ సుమంత్, ఎస్సై వాసంశెట్టి రవిచంద్రకుమార్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శ్రీను భార్య దేవి, దుర్గారావు పరారీలో ఉన్నారని వారిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వారు తెలిపారు. శ్రీను మృతదేహాన్ని అనపర్తి సీహెచ్సీకి తరలించినట్టు సీఐ తెలిపారు.