
పంచ భూతాలను కాపాడుకోవాలి
పిఠాపురం: ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించడం ద్వారా పంచ భూతాలను కాపాడుకోవచ్చునని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఏరువాక పౌర్ణమిను పురస్కరించుకుని పిఠాపురం, ఆశ్రమ ప్రాంగణంలో బుధవారం సస్యవృద్ధి బీజారోపణోత్సవం ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా తమ ఆశ్రమం వద్ద ఏరువాక పౌర్ణమి నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సేంద్రియ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను సాధించడమే ఆధ్యాత్మిక వ్యవసాయమని అన్నారు. దానికి ప్రేరణ కలిగించే కార్యక్రమమే సస్యవృద్ధి బీజారోపణోత్సవం అని తెలిపారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న దారపురెడ్డి వెంకన్న, దార్లంక సూరిబాబు, యాండ్ర చంద్రావతి, దాసరి పెద్దనాగేశ్వరరావు, గుళ్ళపల్లి వీరభద్రరావును సత్కరించారు. పరబ్రహ్మ మొహియుద్దీన్ బాద్షా ఆధ్యాత్మిక వ్యవసాయం 2025 పురస్కారాన్ని పశ్చిమగోదావరి జిల్లా చీమలవారిగూడెంకు చెందిన చీమల వెంక టేష్కు అందజేసి రూ.10వేల నగదు పురస్కారాన్ని, జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త నడింపల్లి రామగోపాలవర్మ డ్రోన్లతో వ్యవసాయం గురించి రైతులకు వివరించారు. అంబాజీపేట హార్టికల్చర్ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.బి.వి చలపతి వివిధ పంటలలో జీవ నియంత్రణ పద్ధతులను తెలిపారు. ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ జాయింట్ సెక్రటరీ వాసంశెట్టి సత్య నారాయణమూర్తి, గోలి సుభాష్, పృథ్వీరాజ్ కఠారి, పొట్రు శశికాంత్ సమీకృత ప్రకృతి వ్యవసాయంపై మాట్లాడారు. కెప్టెన్ అజ్జరపు మల్లికార్జునరావు, ఎస్సార్ కార్పొరేషన్ మాజీ సీఈవో జి.వి.కృష్ణంరాజు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం గురించి తెలిపారు. పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ పాల్గొన్నారు.
ఏరువాక సాగిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా