
తప్పిపోయిన బాలుడు
పిఠాపురం: తప్పిపోయిన ఓ బాలుడిని పోలీసులు గంట వ్యవధిలో పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. గొల్లప్రోలు ఈబీసీ కాలనీకి చెందిన పబ్బిరెడ్డి పాపారావు, కావ్య దంపతులకు మూడేళ్ల కుమారుడు రిత్విక్ శ్రీహన్ ఉన్నాడు. ఆ బాలుడిని తీసుకుని ఆ దంపతులు గొల్లప్రోలు మార్కెట్ సెంటర్లోని కావ్య అన్నయ్య ఘట్టెం అప్పలరాజు ఇంటికి మంగళవారం వెళ్లారు. అక్కడ ఆడుకున్న బాలుడు శ్రీహన్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా అతడి ఆచూకీ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గొల్లప్రోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ తన సిబ్బందితో కలసి గాలింపు చేపట్టారు. బాలుడు శ్రీహన్ గొల్లప్రోలు వద్ద 216 జాతీయ రహదారి పక్కన ఉన్న ఒక హోటల్ వద్ద ఉన్నట్లు గంట వ్యవధిలోనే గుర్తించారు. ఆ బాబును పట్టుకుని, వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఫ గంట వ్యవధిలో పట్టుకున్న పోలీసులు
ఫ తల్లిదండ్రులకు అప్పగింత