
సచివాలయం అద్దాలు ధ్వంసం
తుని రూరల్: మండలంలోని తాళ్లూరు గ్రామ సచివాలయం కిటికీల అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ఎంపీడీఓ కె.సాయినవీన్, డిప్యూటీ ఎంపీడీఓ జి.మరిడయ్య సూచనల మేరకు సచివాలయ కార్యదర్శి రేష్మా తుని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సమీపంలో నివాసం ఉంటున్న వారిని విచారించారు. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థలో భాగంగా రూ.40 లక్షలతో భవనం నిర్మించి, ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. దీనిని 2023 జూలైలో అప్పటి ఆర్అండ్బీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రారంభించారు. ఈ భవనంలో మూడు కిటికీల అద్దాలను ధ్వంసం చేసింది ఆకతాయిలా, తాగుబోతులా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.