
ఇసుకాసురులు
● ధవళేశ్వరం బ్యారేజీ నుంచి
సముద్ర సంగమ ప్రాంతం వరకూ..
● చెలరేగిపోతున్న అక్రమార్కులు
● ఏడాదిలో రూ.100 కోట్లకు పైగా
ఇసుక దందా
● గోదావరి ఇసుక, తువ్వ, సముద్ర తీరంలో బొండు ఇసుక, చేలల్లో మట్టి తవ్వకాలు
● దేనినీ వదలని కూటమి నాయకులు
● జిల్లాలో 20 అధికార ర్యాంపుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు
సొంతంగా డ్రెడ్జింగ్
గోదావరి నదీపాయల్లో పడవల మీద డ్రెడ్జర్లు ఏర్పాటు చేసి మరీ ఇసుక తోడేశారు. పి.గన్నవరం మండలం ఊడిమూడిలంకలో అనధికార ఇసుక ర్యాంపు ఏర్పాటు చేసి ఇసుకతో పాటు మట్టి తవ్వకాల కోసం ఏకంగా డ్రెడ్జింగ్ చేశారు. ఇది లంక గ్రామాలకు పెనుముప్పు. అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నిలిపివేశారు.
సాగర తీరాన్నీ వదలకుండా..
జిల్లాలో అల్లవరం, కాట్రేనికోన, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లోని తీర గ్రామాల్లో సముద్ర ఇసుక తవ్వకాలు జోరుగా సాగిపోయాయి. ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. తీరంలోని తువ్వ ఇసుకకు డిమాండ్ ఏర్పడింది. అల్లవరం మండలం ఓడలరేవు, కొమరగిరిపట్నంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. గతంలో చాటుమాటుగా ఈ వ్యవహారాలు సాగుతున్నా ఇటీవల అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. మలికిపురం మండలం తూర్పుపాలెం, కేశనపల్లిల్లో ఇసుక తవ్వకాల జోరు కాస్త తగ్గినా ఆగడం లేదు.
సాక్షి, అమలాపురం: రాష్ట్రంలో గత ఏడాది ప్రభుత్వం మారినప్పటి నుంచి నేటి వరకూ ఇసుకాసురులు చెలరేగిపోతూనే ఉన్నారు. ర్యాంపుల్లో నిబంధనలకు విరుద్ధంగా దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక అంటున్నా అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. ఇక అనధికార ర్యాంపుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘నదీపాయల్లో బండ్లు, ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా ఇసుక తెచ్చుకోవచ్చు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటనను టీడీపీ, జనసేన నేతలు వరంగా మార్చుకున్నారు. బాబు చెప్పిన దాని ప్రకారం జిల్లా ఇసుక కమిటీ ఎంపిక చేసిన ర్యాంపుల నుంచి మాత్రమే ఇసుక తవ్వాల్సి ఉంది. కానీ, ఇదే అదనుగా కూటమి పార్టీలకు చెందిన చోటామోటా నాయకులు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్ర సంగమ ప్రాంతం వరకు గోదావరి నదీపాయలను దొలిచేస్తున్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే..
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు గత ఏడాది జూన్ 4న వెలువడ్డాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖరారైంది. ఆ రోజు సాయంత్రం నుంచే ఇసుక అక్రమార్కులు దందాకు తెర తీశారు. అంతకు ముందు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వరదలు భారీ వర్షాల సమయంలో ఇసుకకు కొరత రాకుండా ఆరు స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి భారీగా ఇసుక నిల్వ ఉంచింది. మొత్తం 2,44,131 మెట్రిక్ టన్నుల ఇసుకను ఆగస్టు మొదటి వారానికల్లా ఇసుకాసురులు ఊడ్చేశారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ఇసుక లేకుండా చేశారు. ప్రభుత్వం ఉచితం పేరుతో టన్నుకు రూ.265 చొప్పున వసూలు చేసిన విషయం తెలిసిందే. స్టాక్ పాయింట్ల వద్ద ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా లారీకి అదనంగా రూ.5 వేల చొప్పున వసూలు చేసి సొమ్ము చేసుకున్నారు. నియోజకవర్గ కీలక నేతలు బి–టాక్స్, వి–ట్యాక్స్ పేరుతో కోట్లు కొల్లగొట్టారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి.
సీఆర్జెడ్ పరిధిలో..
కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) పరిధిలో సైతం అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. రావులపాలెం మండలం గోపాలపురం సీఆర్జెడ్ పరిధిలో ఉన్నప్పటికీ ఇసుక తవ్వేశారు. అది కూడా గోపాలపురం – సిద్ధాంతం మధ్య ఉన్న రెండు వంతెనలకు 300 మీటర్ల సమీపంలోనే ఇసుక తవ్వేయడం గమనార్హం. పి.గన్నవరంలో సైతం సీఆర్జెడ్ నిబంధనలను తోసిరాజని తవ్వేశారు. అయినవిల్లి మండలం కొండుకుదురు పరిసర ప్రాంతాలు, ఐ.పోలవరం మండలం ఎదుర్లంక, కొమరగిరి, పాత ఇంజరం, గుత్తెనదీవి, జి.వేమవరం, ముమ్మిడివరం మండలం గేదెల్లంక, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక, గోవలంకలలోను సీఆర్జెడ్ పరిధిలో ఇసుక తవ్వేశారు.
పి.గన్నవరంలో
‘జట్టు కట్టారు’
పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో కూటమి నేతలు ఎన్నికల్లోనే కాకుండా ఇసుక అక్రమ తవ్వకాల్లో సైతం జట్టు కట్టారు. మామిడికుదురు మండలం బి.దొడ్డవరం, ఆదుర్రులో ఇసుక తవ్వకాలు సాగించారు. అయినవిల్లి మండలం కొండుకుదురులంకలో రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు జరిగాయి. పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెంలో తువ్వ ఇసుక అనుమతులు తెచ్చుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అనుమతులివ్వగా దీనిని అడ్డం పెట్టుకుని అక్రమ తవ్వకాలు జోరుగా చేస్తున్నారు. పెదకందాలపాలెం, ఉడిమూడి, మానేపల్లిలో సైతం ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయి నేత కనుసన్నల్లో ఈ దందా సాగుతోంది.

ఇసుకాసురులు

ఇసుకాసురులు