
అలల దారిలో..వేటబాటలో..
4 రోజుల్లో ముగియనున్న నిషేధం
14వ తేదీ అర్ధరాత్రి నుంచి సముద్రంలో చేపల వేటకు అనుమతి
బోట్లు, వలలు సిద్ధం చేసుకుంటున్న మత్స్యకారులు
కాకినాడ రూరల్: సాగర తీరంలో క్రమంగా సందడి మొదలవుతోంది.. వలలు సిద్ధమవుతున్నాయి.. అలల దారిలో పయనించేందుకు బోట్లు రెడీ అవుతున్నాయి.. సుమారు రెండు నెలల సుదీర్ఘ విరామం అనంతరం సముద్రంలో చేపల వేటకు మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. చేపల సంతానోత్పత్తికి వీలుగా గత ఏప్రిల్ 15 నుంచి బంగాళాఖాతంలో చేపల వేటపై నిషేధం అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నిషేధం గడువు ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రితో ముగియనుంది. నాలుగు రోజుల్లో మత్స్యకారులు ఎటువంటి ఆంక్షలూ లేకుండా సముద్రంలో చేపల వేట చేసుకోవచ్చు. దీంతో, సముద్రంలో వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు అన్నివిధాలా సంసిద్ధులవుతున్నారు. దీంతో, మాంసాహార ప్రియులు లొట్టలేసుకుని తినేందుకు సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. జిల్లా వాసులకే కాకుండా ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఇవి ఎగుమతి కానున్నాయి.
జిల్లాలో తొండంగి మండలం మొదలుకొని తాళ్లరేవు వరకూ సుమారు 94 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. తీర ప్రాంత మండలాల్లో 58 మత్స్యకార ఆవాసాలున్నాయి. సుమారు 1,95,184 మంది మత్స్యకారులు నివసిస్తున్నారు. వీరిలో సముద్రంలో చేపల వేట ద్వారా 36,101 మంది ఉపాధి పొందుతున్నారు. మత్స్యకారులతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 75 వేల మంది చేపల వేట, అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో మొత్తం 23 చోట్ల ఫిష్ ల్యాండింగ్ సదుపాయం ఉండగా కాకినాడలో కమ్యూనికేషన్ స్టేషన్ అందుబాటులో ఉంది. 410 మెకనైజ్డ్, 3,732 మోటారైజ్డ్ బోట్లతో పాటు 287 సంప్రదాయ పడవల ద్వారా జిల్లాలోని మత్స్యకారులు సముద్రంలో చేపల వేట సాగిస్తున్నారు. ప్రధానంగా కాకినాడ కుంభాభిషేకం, షిషింగ్ హార్బర్, ఉప్పాడ రేవులు చేపల ఎగుమతులకు ప్రసిద్ధి చెందాయి.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మత్స్యకార భరోసా
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019 నుంచి 2024 వరకూ వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10 వేల చొప్పున వేట నిషేధ భృతి ఇచ్చి ఆదుకుంది. ఆంతకు ముందు టీడీపీ ప్రభుత్వం రూ.4 వేలు మాత్రమే అందించేంది. దీనిని 2019లో అప్పటి సీఎం వైఎస్ జగన్ రూ.10 వేలకు పెంచారు.
నేడు సక్రమంగా అందని పరిహారం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులకు వేట నిషేధ భృతి రూ.20 వేల చొప్పున అందిస్తామని చెప్పారు. గత ఏడాది వేట నిషేధ భృతి ఎగ్గొట్టేశారు. తాజాగా 2025 వేట నిషేద భృతి మాత్రం చెల్లించింది. జిల్లాలో 4,451 బోట్లకు సంబంధించి 25,752 మంది మత్స్యకారులను గుర్తించగా.. రకరకాల వడపోతల అనంతరం వీరిలో 24,762 మందిని అర్హులని నిర్ధారించారు. వీరిలో 1,445 మందికి వేట నిషేధ భృతి జమ కాలేదు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ అవకపోవడంతో నిధులు జమ కాలేదని, వీటిలో 1,200 మందివి సరిచేసి తిరిగి ప్రభుత్వానికి పంపామని, మిగిలిని 245 మంది ఊళ్లలో లేకపోవడంతో సమస్య ఏర్పడిందని మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు.