
కొమ్మినేని అరెస్టు హేయం
కాకినాడ రూరల్: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం చాలా హేయమైన చర్యని, రాష్ట్రంలో కక్షసాధింపులకు ఇదొక నిదర్శనమని మాజీ మంత్రి, ఒకప్పటి జర్నలిస్టు, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకంటే సీనియర్ అయిన కొమ్మినేని ప్రస్తుతం సాక్షిలో పని చేస్తున్నారని, ఆయనను అరెస్టు చేయడం సాక్షిపై కక్షో లేక వైఎస్సార్ సీపీపై కక్షో తెలియడం లేదని అన్నారు. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వారు వ్యక్తం చేసే అభిప్రాయాలకు దానిని నిర్వహిస్తున్న మోడరేటర్ కొమ్మినేనిని బాధ్యులను చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ప్రజలు ప్రతీదీ గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్లను అరెస్టు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని, ఇప్పుడు జర్నలిస్టుల అరెస్టులు కూడా ప్రారంభించారని దుయ్యబట్టారు. కొమ్మినేని అరెస్టును కన్నబాబు తీవ్రంగా ఖండించారు.