ఈసారి ట్రావెల్‌ సర్వే! | - | Sakshi
Sakshi News home page

ఈసారి ట్రావెల్‌ సర్వే!

May 24 2025 12:11 AM | Updated on May 24 2025 12:11 AM

ఈసారి

ఈసారి ట్రావెల్‌ సర్వే!

అన్నవరం దేవస్థానం, ఇరిగేషన్‌ అధికారుల మధ్య 15 ఏళ్లుగా స్థల వివాదం

ఇప్పటికి మూడుసార్లు సర్వే చేసినా

తేలని సమస్య

అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఘాట్‌రోడ్‌ పక్కనే పంపా రిజర్వాయర్‌ను ఆనుకుని ఉన్న స్థలంపై నెలకొన్న వివాదం తేల్చేందుకు ట్రావెల్‌ సర్వే చేయించాలని నిర్ణయించారు. ఈ స్థలం దేవస్థానానిదా లేక, ఇరిగేషన్‌ శాఖకు చెందుతుందా అనే దానిపై 15 సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. ఈ స్థలం హక్కుదారులను తేల్చేందుకు ఇప్పటికి మూడుసార్లు సర్వే చేశారు. తాజాగా మొత్తం దేవస్థానానికి సంబంధించిన స్థలాన్ని కూడా కలిపి ట్రావెల్‌ సర్వే చేయించాలని నిర్ణయించినట్లు పెద్దాపురం ఆర్డీఓ రమణి తెలిపారు.

దేవస్థానం రికార్డుల ప్రకారం రత్నగిరి నుంచి పంపా వరకు దేవస్థానానిదే...

అన్నవరం దేవస్థానానికి ఆరెంపూడి గ్రామ సర్వే నంబర్‌ 24.బి లో 54.69 ఎకరాల కొండ ఉంది. దేవస్థా నం క్వార్టర్స్‌ నుంచి ప్రారంభమై రత్నగిరి రామాలయం నుంచి పంపా రిజర్వాయర్‌ వరకు ఉన్న స్థలం రికార్డులలో దేవస్థానానికి చెందినదిగా నమోదై ఉంది. ఇందులో రెండో ఘాట్‌రోడ్‌ను ఆనుకుని పవర్‌హౌస్‌ వరకు ఉన్న పంపా రిజర్వాయర్‌ స్థలం కూడా తమదేనని దేవస్థానం అధికారులు అంటున్నారు. ప్రస్తుతం పంపా రిజర్వాయర్‌ను ఆనుకుని ఉన్న ఆ స్థలంలో 25 సంవత్సరాలుగా హరిణి బోట్‌ షికార్‌, అభయ హోటల్‌ పేరుతో ప్రయివేట్‌ నిర్మాణాలు ఉన్నాయి. ఈ స్థలాన్ని ఇరిగేషన్‌ శాఖ నుంచి లీజుకు తీసుకున్నట్లు ఆ నిర్మాణాల నిర్వాహకులు చెబుతున్నారు.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో

ఆక్రమణలు ఖాళీ చేయించాలని ఆర్డినెన్స్‌

2023లో అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌ –5 ప్రకారం దేవస్థానం స్థలం ఆక్రమించిన వారికి నోటీసు ఇచ్చి, తగు సమాధానం చెప్పకపోతే ఆక్రమణలు కూల్చి వేయాలని పేర్కొన్నారు. దాని ప్రకారం దేవస్థానం అధికారులు హరిణి బోట్‌ షికార్‌, అభయ్‌ హోటల్‌ అక్రమ నిర్మాణాలని గుర్తించామని ఇరిగేషన్‌ అధికారులకు గత ఏడాది జూలైలో నోటీసు ఇచ్చారు. ఆ నోటీస్‌కు ఇరిగేషన్‌ అధికారులు స్పందిస్తూ అది తమ స్ధలమేనని తెలిపారు. దీనిపై అప్పటి దేవస్థానం ఈఓ కే రామచంద్రమోహన్‌ కలెక్టర్‌కు నివేదిక పంపడంతో దీనిపై జాయింట్‌ సర్వే నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. గతేడాది ఆగస్టులో జాయింట్‌ సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ఆ స్థలం దేవస్థానానిదేనని తేలింది. దానిపై ఇరిగేషన్‌ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మళ్లీ జాయింట్‌ సర్వేకు కలెక్టర్‌ షణ్మోహన్‌ ఆదేశించారు.

అధికారుల సమక్షంలో జాయింట్‌ సర్వే

ఏప్రిల్‌ ఒకటో తేదీన పంపా రిజర్వాయర్‌ స్లూయిజ్‌ గేట్లు ఎదురుగా గల కొండ వద్ద నుంచి పవర్‌ హౌస్‌ కు వెళ్లే మార్గంలోని హరిణి బోట్‌ షికార్‌ నిర్మాణాల వరకు జాయింట్‌ సర్వే నిర్వహించారు. లాండ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ డి.భారతి, డిస్ట్రిక్ట్‌ లాండ్‌ రికార్డ్స్‌ అండ్‌ సర్వే డీఈ కే శ్రీనివాస్‌, అన్నవరం దేవస్థానం డీసీ చంద్రశేఖర్‌, ఏసీ రామ్మోహన్‌రావు, ఇరిగేషన్‌ ఈఈ శేషగిరిరావు హాజరయ్యా రు. పెద్దాపురం ఆర్డీఓ కే రమణి పంపా ఒడ్డున గల నిర్మాణాలను పరిశీలించారు. దేవస్థానం, ఇరిగేషన్‌ అధికారుల వాదనలను విన్నారు. అయితే 50 రోజులు దాటినా ఈ సర్వే నివేదిక వెలుగు చూడలేదు.

ట్రావెల్‌ సర్వే చేయించాలని నిర్ణయించాం

కాగా ఈ వివాదం సంక్లిష్టంగా మారినందున 24 బీ సర్వే నంబర్‌లో ఉన్న దేవస్థానం లాండ్‌ అంతా కలిపి ట్రావెల్‌ సర్వే చేయించాలని నిర్ణయించాం. త్వరలోనే ఈ సర్వే చేయిస్తాం.

– కే రమణి,

ఆర్డీఓ, పెద్దాపురం

2011లో తొలిసారి సర్వే

2011లో అప్పటి ఈఓ కే రామచంద్రమోహన్‌ తమ రికార్డుల ప్రకారం ఆ స్థలమంతా దేవస్థానానిదేనని, అందువలన సర్వే చేయించాలని ప్రభుత్వాన్ని కోరడంతో సర్వే ప్రారంభించారు. అయితే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఉండడంతో ఆ సర్వే మధ్యలోనే నిలిచిపోయింది.

ఈసారి ట్రావెల్‌ సర్వే! 1
1/1

ఈసారి ట్రావెల్‌ సర్వే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement