
కళ్లముందే కన్నతల్లి మృత్యువాత
● బైక్ను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం
● మహిళ మృతి, ఇద్దరికి గాయాలు
● తండ్రిని ఆసుపత్రి నుంచి
తీసుకువస్తుండగా ఘటన
తొండంగి: తండ్రిని ఆసుపత్రిలో చూపించి తిరుగు ప్రయాణంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని బైకు అదుపు తప్పడంతో మహిళ మృత్యువాత పడగా భర్త, కుమారుడు తీవ్రగాయాలపాలైన సంఘటన బెండ పూడి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తొండంగి మండలం గోపాలపట్నం గ్రామానికి చెందిన సాగి ఆనంద్ తన తండ్రి సూరిబాబు అనారోగ్యం కారణంగా కాకినాడ ఆసుపత్రికి తల్లి అమ్మాజీ(45)తో కలిసి ముగ్గురు బైక్ పై వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం తిరుగు ప్రయాణంలో బెండపూడి జాతీయ రహదారిపై వీరి బైకును గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో బైకు అదుపుతప్పి రోడ్డు పక్కన గోతిలో పడిపోయారు. ఈ ఘటనలో అమ్మాజీ తలకు రాయి తగలడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఆనంద్, తండ్రి సూరిబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకుని అంబులెన్స్ రప్పించారు. తీవ్రగాయాలైన ఆనంద్, సూరిబాబుల కు అంబులెన్స్ సిబ్బంది మెరుగైన వైద్యం కోసం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బి.జగన్మోహన్రావు తె లిపారు. కళ్లముందే కన్నతల్లి మృత్యువాత పడటంతో భర్త, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపించారు.

కళ్లముందే కన్నతల్లి మృత్యువాత