
రత్నగిరి వనదుర్గకు అపచారమా?
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కొన్ని నిర్ణయాలు విమర్శలకు తావిస్తున్నాయి. తాజాగా సత్యదేవుని కల్యాణ మహోత్సవాలలో రద్దు చేసిన వైదిక కార్యక్రమాలలో రత్నగిరి వన సంరక్షుకురాలు వనదుర్గ అమ్మవారికి శుక్రవారం నిర్వహించే చండీహోమం, పౌర్ణిమ రోజు నిర్వహించే ప్రత్యంగిర హోమాలు కూడా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వాస్తవానికి గతంలో జరిగిన కల్యాణ మహోత్సవాలలో ఈ హోమాలు యథావిధిగా నిర్వహించారు.
కల్యాణోత్సవాల వేడుకలకు ఆటంకం అని కొన్ని వైదిక కార్యక్రమాల రద్దు
సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు వారం రోజులు జరుగుతాయి. ఈ సందర్భంగా కొన్ని వైదిక కార్యక్రమాలు రద్దు చేస్తారు. రద్దు చేసిన కార్యక్రమాలన్నీ స్వామి, అమ్మవారికి చేసేవే. సత్యదేవుని నిత్యకల్యాణం, ఆయుష్యహోమం, సహస్ర దీపాలంకార సేవ, పంచహారతుల సేవ, పవళింపుసేవ ఉన్నాయి. వీటితో బాటు వనదుర్గ అమ్మవారికి తొమ్మిదో తేదీన నిర్వహించే చండీహోమం, 12వ తేదీన నిర్వహించే ప్రత్యంగిర హోమాలు కూడా నిలిపివేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వందేళ్ల క్రితం శృంగేరీ పీఠాధిపతులు అన్నవరంలో రత్నగిరి వనాన్ని రక్షించే దేవతగా వనదుర్గ అమ్మవారిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి అమ్మవారికి చండీహోమం, ప్రత్యంగిర హోమాలు నిర్వహిస్తున్నారు.
గతంలో హోమాల నిర్వహణ
● 2023లో ఎస్ఎస్ చంద్రశేఖర్ అజాద్ ఈఓగా ఉన్నపుడు జరిగిన సత్యదేవుని కల్యాణ మహోత్సవాలలో మే నెల ఐదో తేదీన వైశాఖ పౌర్ణిమ, శుక్రవారం రెండూ కలిసి రావడంతో వనదుర్గ అమ్మవారికి చండీ, ప్రత్యంగిర హోమాలు నిర్వహించారు.
● 2024 కల్యాణోత్సవాలలో ప్రస్తుత దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ అప్పటి ఈఓగా మే 23న వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం నిర్వహించారు. మే 24న వనదుర్గ అమ్మవారికి చండీహోమం నిర్వహించారు.
అయితే ఈ ఉత్సవాలలో చండీహోమం, ప్రత్యంగిర హోమం రద్దు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ హోమాలు నిర్వహించే రుత్విక్కులు, అర్చకులు వేరు. వీరు స్వామివారి ఉత్సవాలలో పాల్గొనరు. హోమాల సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే. స్వామి కల్యాణ వేడుకలన్నీ సాయంత్రం, రాత్రి జరిగేవే. అధికారులు పునరాలోచన చేసి ఆ హోమాలు యథావిధిగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
ఎన్నడూ లేని విధంగా
చండీ, ప్రత్యంగిర హోమాల నిలుపుదల