
జగన్ను కలసిన ముదునూరి
సాక్షిప్రతినిధి, కాకినాడ: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ నరసాపురం పార్లమెంట్ పరిశీలకులుగా నియమితులైన ప్రత్తిపాడు నాయకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు బుధవారం తాడేపల్లిలో కలిశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల మీద నిరంతరం పార్లమెంట్ పరిశీలకులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి ప్రజల పక్షాన పోరాటాలు చేయాలని జగన్ సూచించారని మురళీకృష్ణంరాజు తెలియచేశారు. ఎప్పటికప్పుడు ప్రాంతీయ సమన్వయకర్తల సూచనలను కింది స్థాయికి తీసుకువెళ్లాలని చెప్పారన్నారు.
సచివాలయాల్లో
మరో ఆరు సేవలు
కాకినాడ సిటీ: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో నూతన రైస్ కార్డుల నమోదుతో పాటు రైస్ కార్డులకు సంబంధించి మరో ఆరు సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా బుధవారం నుంచి ప్రారంభించినట్లు కలెక్టర్ షణ్మోహన్ సగిలి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నూతన రైస్ కార్డుల కోసం ఇప్పటి వరకూ అందిన దరఖాస్తులను, కొత్తగా పెట్టుకునే దరఖాస్తులను సచివాలయాల్లో ఏపీ సేవా ప్లాట్ ఫారమ్ ద్వారా నమోదు చేసేందుకు మండల, సచివాలయ సిబ్బందిని సిద్ధం చేశామన్నారు. నూతన రైస్కార్డుల నమోదుతో బాటు రైస్ కార్డుల విభజన, రైస్ కార్డులలో సభ్యులను చేర్చడం, సభ్యుల తొలగింపు, రైస్ కార్డు సరెండర్ చేయడం, కార్డులో చిరునామా మార్పు, తప్పుగా నమోదైన రైస్ కార్డు ఆధార్ సీడింగ్ సవరణ సేవల కోసం కూడా ప్రజలు సచివాలయాలను సంప్రదించవచ్చన్నారు.
ఆర్ఎంసీ ప్రిన్సిపాల్గా
విష్ణువర్ధన్
కాకినాడ క్రైం: ప్రతిష్టాత్మక కాకినాడ రంగరాయ వైద్య కళాశాల 51వ ప్రిన్సిపాల్గా డాక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్ఎంసీ అనస్థీషియా హెచ్వోడీగా పనిచేసిన డాక్టర్ విష్ణువర్ధన్ తాజా పదోన్నతులలో ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడు(డీఎంఈ) డాక్టర్ డీఎస్విఎల్ నరసింహం ఈ మేరకు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ విష్ణువర్ధన్ మీడియాతో మాట్లాడుతూ కళాశాల సర్వతోముఖాభివృద్దికి శాయశక్తులా శ్రమిస్తానని అన్నారు. విద్యార్థులు, బోధకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందేలా చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.
పీఈటీ సంఘ ఎన్నికలకు
6 నామినేషన్లు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ ఎన్నికలు ఈ నెల 17న రాంకుమార్ వ్యాయామ ఉపాధ్యాయ సంఘ భవన్లో జరగనున్నాయి. ఈ ఎన్నికలకు నామినేషన్లు బుధవారం మధ్యాహ్నం అభ్యర్థులు దాఖలు చేశారు. వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు వి.రవిరాజు నామినేషన్లు స్వీకరించారు. అధ్యక్ష పదవికి పి.శ్రీనివాస్, జి.రవికౌర్, ఊం.హరిబాబు, కార్యదర్శి పదవికి వి.మాచరరావు, కేవీవీ నరసింహమూర్తి, కోశాధికారి పదవికి కె.నాగలింగేశ్వరరావు నామినేషన్లు వేశారు. శుక్రవారం సాయంత్రం లోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చునని రవిరాజు తెలిపారు. రాష్ట్ర పీఈటీ సంఘ మాజీ అధ్యక్షుడు జార్జి, సీనియర్ పీడీలు బంగార్రాజు, పట్టాభి, సునీల్ పాల్గొన్నారు.
ఆన్లైన్లో
ఫైనల్ మెరిట్ లిస్టు
కాకినాడ క్రైం: గత ఏడాది జనవరి 21వ తేదీన రంగరాయ వైద్య కళాశాల పరిధిలో విడుదల చేసిన పారామెడికల్ ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్కు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్టును విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులు ఎన్ఐసీ వెబ్సైట్లో ఈ లిస్టును పొందవచ్చు.

జగన్ను కలసిన ముదునూరి