
సీహెచ్ఓల వినూత్న నిరసన
రాజమహేంద్రవరం రూరల్: తమ న్యాయమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం కళ్లుండీ చూడటం లేదని, చెవులుండీ వినడం లేదని, నోరుండీ మాట్లాడటం లేదని పేర్కొంటూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓ) కళ్లు, చెవులు, నోరు మూసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. నిరవధిక సమ్మెలో భాగంగా ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అసోసియేషన్ ఆధ్వర్యాన సీహెచ్ఓలు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన మంగళవారం 9వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేంత వరకూ సమ్మె ఆపేది లేదని స్పష్టం చేశారు. ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సీహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, విలేజ్ క్లినిక్ అద్దె బకాయిలు, విద్యుత్ బిల్లులు వెంటనే చెల్లించాలని నినదించారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.మమత మాట్లాడుతూ, సీహెచ్ఓలకు ఉద్యోగ భద్రత కల్పించే వరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.