
నీట్కు 97.53 శాతం హాజరు
కాకినాడ సిటీ: వైద్య విద్యా కోర్సులలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షలు జిల్లాలోని 10 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షకు మొత్తం 2,880 మందికి గాను 2,812 మంది (97.53 శాతం) హాజరయ్యారు. 68 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్ష జరిగింది. విద్యార్థులను గంట ముందుగా ఆయా పరీక్ష కేంద్రాల లోపలకు అనుమతించారు. ప్రశ్న పత్రాలను కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్ష కేంద్రాలకు తరలించారు.
నేడు పీజీఆర్ఎస్
కాకినాడ సిటీ: జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో సోమవారం ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ నిర్వహించనున్నారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. మండల స్థాయిలో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఆయా మండల స్థాయి అధికారులందరూ హాజరు కావాలని సూచించారు.
కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు
ఐవీ సుబ్బారావు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు కోరారు. కాకినాడ జేఎన్టీయూలో ఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో బలమైన శక్తిగా ఏపీయూడబ్ల్యూజే ఉందన్నారు. ప్రస్తుతం జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు ముగిసిందని, దీనిపై ఈ నెలలో జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని కొత్త అక్రిడిటేషన్లు జారీ చేయాలని అన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు స్వాతి ప్రసాద్ మాట్లాడుతూ, పోరాటాలకు పురిటి గడ్డగా ఉమ్మడి జిల్లా ఉందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఏపీయూడబ్ల్యూజే తరఫున ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు నూతన కమిటీలు నియమించామని చెప్పారు. సమావేశంలో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖర్ కూడా ప్రసంగించారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షునిగా డి.అంజిబాబు, కార్యదర్శిగా అర్జున్లతో కూడిన నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. యూనియన్ రాష్ట్ర ప్రతినిధి శ్రీరామ్మూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా దురాని వ్యవహరించారు.
లోవకు పోటెత్తిన భక్తజనం
తుని రూరల్: లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 40 వేల మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించినట్లు ఆలయ ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,83,600, పూజా టికెట్లకు రూ.67,890, కేశఖండనకు రూ.17,960, వాహన పూజలకు రూ.4,830, కాటేజీల ద్వారా రూ. 87,716, విరాళాలుగా రూ.95,242 కలిపి రూ. 4,57,238 ఆదాయం వచ్చిందని వివరించారు.
అయినవిల్లికి భక్తుల తాకిడి
అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 44 మంది, లక్ష్మీగణపతి హోమంలో 17 జంటలు, స్వామివారి పంచామృతాభిషేకాల్లో 4 జంటలు పూజలు చేశారు. 13 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, నలుగురికి తులాభారం, ఒకరికి నామకరణం, ఏడుగురికి అన్నప్రాశన నిర్వహించారు. 37 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 2400 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. స్వామివారికి రూ.1,98,976 ఆదాయం లభించింది.

నీట్కు 97.53 శాతం హాజరు