
దేవస్థాన పారిశుధ్య కార్మికులకు జీతాలు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న 349 మంది పారిశుధ్య సిబ్బందికి మార్చి నెల జీతాలు బుధవారం చెల్లించారు. పారిశుధ్య కార్మికులకు నెలకు రూ.10,500, సూపర్వైజర్లకు రూ.12,500 చొప్పున జీతాలు చెల్లించినట్టు వారు తెలిపారు. ఏప్రిల్ నెల దాదాపు గడిచిపోయినా గుంటూరుకు చెందిన కాంట్రాక్ట్ సంస్థ కనకదుర్గా ఏజెన్సీ ఇంకా మార్చి జీతమే చెల్లించకపోవడంతో పారిశుధ్య సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ‘సాక్షి’లో ఈ నెల 25న ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు స్వామీ?’ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన అధికారులు కాంట్రాక్ట్ సంస్థకు పారిశుధ్య కార్మికుల బిల్లు ఆగమేఘాలపై పూర్తి చేసి చెక్కు అందజేశారు. దీంతో బుధవారం సిబ్బంది ఖాతాల్లో నగదు జమయింది. ఏప్రిల్ బిల్లు మే పదో తేదీకల్లా చెల్లించేలా చూడాలని సిబ్బంది కోరారు.