తుని రూరల్: భక్తులు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానంలో క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఈ బోర్డులను శనివారం తన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేవస్థానంలో సౌకర్యాలు, ఇతర అంశాలపై భక్తులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అభిప్రాయాలు తెలియజేయవచ్చన్నారు. ఈ అభిప్రాయాలు నేరుగా ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్కు చేరుతాయన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్లు కేవీ రమణ, మూర్తి, ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సీలేరు నుంచి
9,300 క్యూసెక్కులు
సీలేరు: గోదావరి డెల్టాలో రబీ సాగుకు సీలేరు కాంప్లెక్స్ నుంచి 9,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏపీ జెన్కో అధికారులు తెలిపారు. రబీ నీటి ఎద్దడి నేపథ్యంలో గోదావరి డెల్టాకు సీలేరు జలాలను విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు గతంలో కోరారు. ఈ మేరకు డొంకరాయి నుంచి 5 వేలు, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం నుంచి 4,300 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నామని జెన్కో అధికారులు వివరించారు. గత ఫిబ్రవరి 10వ తేదీ నుంచి శనివారం వరకూ గోదావరి డెల్టాకు 10.19 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. ఈ నెల 31 వరకూ నీటిని విడుదల చేయనున్నారు.
శృంగార వల్లభుని
సన్నిధిలో రద్దీ
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభస్వామి ఆలయం శనివారం వేలాదిగా వచ్చిన భక్తులతో రద్దీగా మారింది. స్వామివారిని సుమారు 15 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు స్వామి వారిని పూలమాలలతో విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదాన విరాళాల రూపంలో స్వామి వారికి రూ.3,22,160 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. సుమారు 4 వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.
కిక్కిరిసిన రత్నగిరి
అన్నవరం: పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిక్కిరిసింది. పరీక్షలు ముగియడంతో ఇంటర్ విద్యార్థులు, వారికి ఇతర భక్తులు తోడవడంతో సత్యదేవుని సన్నిధిలో రద్దీ ఏర్పడింది. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 1,600 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 4 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సెలవు రోజు కావడంతో ఆదివారం కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగించనున్నారు.
ఘనంగా ప్రాకార సేవ
సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి, తిరుచ్చి వాహనంపై వేంచేయించారు. అర్చకుల పూజల అనంతరం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కొబ్బరికాయ కొట్టి ప్రాకార సేవ ప్రారంభించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజన, మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
అభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్ బోర్డులు
అభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్ బోర్డులు