అమలాపురం టౌన్: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థాపించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వచ్చే ఆగస్టు నెలలో ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ పాఠశాల పూర్వపు విద్యార్థి, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు తెలిపారు. 1876లో ఈ పాఠశాలను స్థాపించారని పేర్కొన్నారు. పాఠశాల భవనాలు 1863లో నిర్మితమైనట్లు, ఈ ప్రదేశంలో గుర్రపు శాల, పెద్ద గంటతో చర్చి , పలు భవనాలు, ఖాళీ స్థలంతో ఉండేదని అప్పటి కలెక్టర్ పెడరిక్ రికెట్స్ హెమింగ్ తమ గెజిటీర్లో ప్రచురించారని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. 1876లో ఆ స్థలం, భవనాలు ఉన్నత పాఠశాలగా మార్పు చెందాయని పేర్కొన్నారు. పాఠశాల 150 సంవత్సరాల ఉత్సవాలను పలువురు ప్రముఖులు, పూర్వ విద్యార్థులతో ఘనంగా నిర్వహించాలనుకుంటున్నామని చెప్పారు. ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఎక్కడున్నా ఫోన్ల నంబర్లు పంపించాలని ఎమ్మెల్సీ విజ్ఞప్తి చేశారు. పాఠశాలకు సంబంధించి మీ దగ్గర పొటోల రూపంలో జ్ఞాపకాలు, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల పేర్లు ఉంటే వాటిని కూడా పంపించాలని కోరారు. 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముద్రించే సావనీర్లో వాటిని పొందపరిచాలని నిర్ణయించామని తెలిపారు. పూర్వ విద్యార్థుల వివరాలు, సమాచారాన్ని 63052 08010 ఫోన్ నంబర్కు వాట్సాప్ చేయాలని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు విజ్ఞప్తి చేశారు. కొంతమంది పాఠశాల పూర్వ విద్యార్థులు స్థానిక జెడ్పీ ఉన్నత బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల క్రీడా స్థలంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అధ్యక్షతన గురువారం ఉదయం సమావేశమై 150 సంవత్సరాల ఉత్సవాల నిర్వహణపై చర్చించారు.
వచ్చే ఆగస్టులో
ఉత్సవాల నిర్వహణకు సన్నాహాలు
పూర్వపు విద్యార్థి,
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు