
స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడాలి
కాకినాడ క్రైం: స్టేషన్కు వచ్చే ఫిర్యాదీలు, ఇతరులతో మర్యాద ఇచ్చి మాట్లాడాలని ఎస్పీ బిందుమాధవ్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, బాలికలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. శక్తి యాప్ను వారి సెల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేయించి, హెల్ప్లైన్ నంబర్లు ప్రదర్శించాలని సూచించారు. వేసవిలో రాత్రి వేళ నేరాలు అధికంగా జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తం కావాలని అన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సాంకేతికతను ఉపయోగించి కేసులు ఛేదించే వారిని ఏబీసీడీ అవార్డుకు సిఫారసు చేస్తామని చెప్పారు. చైన్ స్నాచింగ్ను నియంత్రించాలన్నారు. రౌడీ షీటర్ల రికార్డులు ఎప్పడికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై తగిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల నిఘా తప్పకుండా ఉండాలని స్పష్టం చేశారు. రహదారి భద్రతపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం బంగారం దుకాణం చోరీ కేసును ఛేదించిన, గొల్లపాలెం స్టేషన్ పరిధిలో అనుమానాస్పద వ్యక్తి నుంచి తుపాకులు స్వాధీనం చేసుకుని నేరాన్ని కట్టడి చేసిన అధికారులను, సిబ్బందిని ఎస్పి అభినందించారు.