పిఠాపురం: గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామానికి చెందిన కంద చల్లారావు బుధవారం విడుదల చేసిన గేట్ పరీక్షలో ఆల్ ఇండియాలో 111 ర్యాంకు సాధించాడు. ఇతను త్రిబుల్ ఐటీ నూజివీడులో మెట్రాలజీ డిపార్ట్మెంట్లో 9.7 జీపీఏతో ఉత్తీర్ణుడయ్యాడు. వన్నెపూడి జెడ్పీ హైస్కూల్లో పదవ తరగతి 10/10 ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించాడు. తండ్రి దత్తాత్రేయుడు వ్యవసాయం, తల్లి వరలక్ష్మి గృహిణి. ఈ సందర్భంగా విద్యార్థిని వన్నెపూడి గ్రామ ప్రజలతోపాటు నాయకులు, అధికారులు అభినందించారు.
మహా సంస్థానం హుండీ
ఆదాయం రూ.18,57,246
పిఠాపురం: శ్రీపాద శ్రీవల్లభ మహసంస్థానం హుండీ ఆదాయం రూ.18,57,246 సమకూరినట్లు ఆలయ ఈఓ సౌజన్య తెలిపారు. బుధవారం ఆలయంలో హుండీలను లెక్కించారు. గత ఏడాది డిసెంబర్ 20వ తేదీ నుంచి బుధవారం వరకు ఈ ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు. హుండీల లెక్కింపులో దేవదాయ, ధర్మాదాయ శాఖ తనిఖీదారుడు ఫణీంద్ర కుమార్, స్వచ్ఛంద సంస్థల మహిళలు, అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థుల సర్టిఫికెట్లు నిలుపుదల చేస్తే చర్యలు
కాకినాడ సిటీ: పరీక్షలు పాసైన విద్యార్థులకు ఉత్తీర్ణతా సర్టిఫికెట్ల జారీ నిలుపుదల చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని కలెక్టర్ షణ్మోహన్ సగిలి బుధవారం జిల్లాలోని కళాశాల యాజమాన్యాలకు సూచించారు. విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతన పథకం పరిధిలో ఉన్న కళాశాలలు అన్నింటికి ఫీజు రియంబర్స్మెంటు సొమ్మును నేరుగా ఆయా కళాశాలలకు విడుదల చేయడంతోపాటు, దశల వారీగా పాత బకాయిలను కూడా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాల మంజూరు కాని కారణంగా విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్లు నిరాకరించడం, పరీక్షలు పాసైన విద్యార్థులకు ఉత్తీర్ణతా సర్టిఫికెట్ల జారీ ఆపు చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని కలెక్టర్ షణ్మోహన్ కళాశాల యాజమాన్యాలను మరోమారు కోరారు. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే కళాశాలలపై చర్యలు చేపట్టడంతో బాటు, వాటి వ్యవహార శైలిపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

గేట్ పరీక్షలో వన్నెపూడి విద్యార్థికి 111వ ర్యాంకు