
ఎన్టీఆర్ వసూళ్ల సేవ!
సాక్షి, రాజమహేంద్రవరం: పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ పథకంలోని కొన్ని నెట్వర్క్ ఆస్పత్రులు అడ్డగోలు వ్యవహారానికి తెర తీశాయి. రోగుల భయాన్ని, ఆరోగ్య సమస్యలను ఆసరాగా చేసుకుని అదనపు వసూళ్లకు అర్రులు చాస్తున్నాయి. ప్రభుత్వం అందించే నిధులు ఏ మూలకూ సరిపోవంటూ నమ్మబలికి కో–పేమెంట్లతో అందినకాడికి దోచేస్తున్నాయి. అదనంగా చెల్లిస్తే మెరుగైన వైద్యం, మంచి పరికరాలు వేస్తామంటూ వైద్యులు నమ్మబలుకుతున్నారు. తమకు ఆర్థిక స్థోమత లేదన్నా.. వదలడం లేదు.. ఏదోవిధంగా సర్దుకోవాలని.. అలా చేస్తే ఆరోగ్యం బాగుంటుందని, లేదంటే మీ ఇష్టమంటూ బ్లాక్మెయిలింగ్కు దిగుతున్నారు. వైద్యుల మాటను కాదనలేని రోగులు అప్పులు చేసి మరీ అదనంగా డబ్బు చెల్లించేస్తున్నారు. ఆర్థో(ఎముకలు), న్యూరో విభాగం శస్త్రచికిత్సలు జరిగే ఆస్పత్రుల్లో ఈ తరహా దందా యథేచ్ఛగా జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే కొంతమంది రోగులను ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు తరలించి అక్కడ శస్త్రచికిత్సలు చేసి అదనపు వసూళ్లు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భయమే పెట్టుబడిగా..!
అదనపు వసూళ్ల విషయం బయటకు చెప్పుకుంటే.. వైద్యులు మెరుగైన చికిత్స అందించరేమో అన్న భయంతో రోగులు మిన్నకుండిపోతున్నారు. దీంతో కొన్ని ఆస్పత్రులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిపోయింది. కంటి, న్యూరో, ఆర్థో ఇలా ఏ శస్త్రచికిత్స అయినా.. స్థాయిని బట్టి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, మరికొన్ని ఆస్పత్రులు రూ.20 వేల నుంచి రూ.50 వేలు. కొన్ని ప్రముఖ ఆస్పత్రులైతే రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు దండుకుంటున్నట్లు సమాచారం.
కో–పేమెంట్లు వసూలు చేస్తున్నారిలా..
ఎన్టీఆర్ వైద్యసేవలో ఓ వ్యక్తి సింగిల్ స్టంట్ వేయించుకోవాలంటే రూ.60 వేలు, డబుల్ స్టంట్కు రూ.90 వేలు ప్రభుత్వం ఇస్తుంది. ఇందుకు గాను పేషెంట్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న అనంతరం ఆస్పత్రికి వెళ్లాలి. అలా చేయకుండా నేరుగా ఆస్పత్రికి వెళుతుండటంతో ఓపీ రూ.500 కట్టించేస్తున్నారు. వైద్య పరీక్షలు, యాంజీయోగ్రామ్ చేయాలని రూ.15 వేలు లాగేస్తున్నారు. స్టంట్ వేయాల్సి వస్తే రూ.15 వేలు వెనక్కు ఇస్తాం, లేదంటే లేదంటున్నారు. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ప్రభుత్వం సరఫరా చేసే స్టంట్ చాలా నాసిరకం అని, అది వేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని భయపెడుతున్నారు. లోపల పౌడర్ కోటెడ్, గోల్డ్ కోటెడ్, ప్రీమియం కోటెడ్ , మెటల్ కోటెడ్ స్టంట్ వేస్తే మరో పదేళ్ల పాటు ఆరోగ్యానికి ఢోకా లేదని, ఇందుకు ప్రభుత్వం ఇచ్చే రూ.60 వేలతో పాటు మరో రూ.60 వేలు అదనంగా లాక్కుంటున్నారు. కానీ ఎలాంటి స్టంట్ వేస్తున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
ప్రభుత్వ పరికరాలు నాసిరకమా..?
ఎన్టీఆర్ వైద్యసేవ పథకానికి ప్రభుత్వం నేరుగా పరికరాలను పంపిణీ చేస్తుంది. వీటికి ఆశ (ఆంధ్రప్రదేశ్ మెడికల్ అసోసియేషన్) సభ్యులు, వైద్యులు నిర్ధారించిన ధరల ప్రకారమే చెల్లింపులు చేస్తుంది. అలాంటప్పుడు నాసిరకం ఎలా అవుతాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేవలం ధనార్జనే ధేయ్యంగా ఇలాంటి చర్యలకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి.
మామూళ్ల మత్తులో అధికారులు..?
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్యసేవ ఆస్పత్రులు 78 ఉన్నాయి. అందులో ప్రైవేటు ఆస్పత్రులు 43, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 5, ప్రైమరీ హెల్త్ సెంటర్లు 28, జీజీహెచ్ 1, ఏరియా హాస్పిటల్ 1 ఉన్నాయి. ఇవి కాకుండా మరో 16 దంద వైద్య శాలలు (ఈహెచ్ఎస్) సైతం వైద్య సేవలు అందిస్తున్నాయి. సుమారుగా 5.12 లక్షల మంది ఆరోగ్య శ్రీ కార్డుదారులున్నారు. వీటిపై పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్తో పాటు, టీమ్ లీడర్, ఆరోగ్య మిత్రలు ఉన్నారు. రోగుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విషయం తెలిసినా.. అరికట్టడంలో ఆ శాఖ ఉద్యోగులు శ్రద్ధ చూపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రతి నెలా ఇచ్చే ముడుపులు తీసుకుని మిన్నకుండిపోతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతన్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులను ప్రతి నెలా తనిఖీలు చేయాల్సి ఉన్నా.. అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలున్నాయి.
అమలు అస్తవ్యస్తం
పథకం అమలు అస్తవ్యస్తంగా మారింది. కొన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలు ఉండటం లేదు. 24 గంటల సేవలు అందించే ఆస్పత్రుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలిసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు మాత్రమే విధుల్లో ఉంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఫలితంగా తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు.
విజిలెన్స్ విచారణకు డిమాండ్
ఎన్టీఆర్ వైద్య సేవలపై విజిలెన్స్ అధికారులు సమగ్ర విచారణ జరిపితే దోపిడీ వ్యవహారం బట్టబయలవుతుందన్న డిమాండ్ ప్రజల నుంచి వెల్లువెత్తుతోంది. ప్రభుత్వం స్పందించి ఆ దిశగా చర్యలు చేపడితే సామాన్యులకు న్యాయం జరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఎన్టీఆర్ వైద్య సేవలో
కో–పేమెంట్ల కోసం వైద్యుల తహతహ
మంచి పరికరాలు అమర్చుతామంటూ
రోగులను నమ్మిస్తున్న వైనం
పరికరాల పేరుతో రూ.వేలల్లో అదనపు వసూళ్లు
తూర్పుగోదావరి జిల్లాలో
కొన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో నయా దందా
గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ వ్యవహారం
ఆరోగ్యశ్రీ అధికారులకు తెలిసినా పట్టించుకోని వైనం