బోట్క్లబ్ (కాకినాడ సిటీ): దేశవ్యాప్తంగా 75 లక్షల మంది ఈపీఎఫ్ పెన్షనర్లకు డీఏతో కలిపి కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలనే డిమాండ్తో కాకినాడ ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని పెన్షనర్లు మంగళవారం ముట్టడించారు. ఆలిండియా కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ ఆర్గనైజేషన్ల పిలుపు మేరకు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు మాట్లాడుతూ, 13 సంవత్సరాలుగా ఈపీఎఫ్ పెన్షనర్ల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని అన్నారు. 36 లక్షల మంది కనీసం రూ.వెయ్యి పెన్షన్ కూడా పొందలేని పరిస్థితులు దేశంలో ఉన్నాయన్నారు. ఈపీఎఫ్ వద్ద రూ.8.88 లక్షల కోట్ల కార్పస్ ఫండ్ ఉందని, దీనిపై ఏటా రూ.52 వేల కోట్ల వడ్డీ వస్తోందని చెప్పారు. అయినప్పటికీ పెన్షన్ల రూపంలో కేవలం రూ.14 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. మిగిలిన రూ.38 వేల కోట్లు తిరిగి కార్పస్ ఫండ్కు జమవుతోందని తెలిపారు. ఒకవైపు కార్పొరేట్లకు కేంద్రం రాయితీలు ప్రకటిస్తూ, రూ.వేల కోట్ల బ్యాంకు రుణాలు రద్దు చేస్తోందని, మరోవైపు ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ మంజూరు చేయాలంటే సాకులు చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు బాబూరావు, సీనియర్ నాయకుడు రాందాస్ మాట్లాడుతూ, ఈపీఎఫ్ పెన్షనర్లకు సామాజిక పింఛన్లు ఇవ్వాలని, ఉచిత హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, రైలు ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు రాయితీలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ ఎం.రామారావుకు వినతి పత్రం అందజేశారు.