పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి వారికి అన్నదానం, హుండీల ద్వారా రూ.28,10,646 ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్డి శ్రీనివాస్ తెలిపారు. దేవదాయ శాఖ కాకినాడ డివిజనల్ ఇన్స్పెక్టర్ వి.ఫణీంద్రకుమార్, గ్రామ సర్పంచ్ మొయిళ్ల కృష్ణమూర్తి సమక్షంలో ఆలయంలోని హుండీలను మంగళవారం తెరచి, ఆదాయం లెక్కించారు. మొత్తం 90 రోజులకు గాను హుండీల ద్వారా రూ.21,40,696, అన్నదానం హుండీ ద్వారా రూ.6,69,950 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు. కార్యక్రమంలో అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహిళలను
మోసగించిన సర్కార్ ˘
శాసన మండలిలో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్
అల్లవరం: అధికారంలోకి వస్తే 50 ఏళ్ల వయస్సు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నెలకు రూ.4 వేల పింఛన్ పథకాన్ని వర్తింపజేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. ప్రభుత్వ తీరును శాసన మండలిలో మంగళవారం ఆయన ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలవుతున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పింఛన్లు ఏవని ప్రశ్నించారు. ఈ పథకం కింద బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా మహిళలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 65,49,864 మందికి పింఛన్లు పంపిణీ చేయగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య 63,53,907కు తగ్గిందని తెలిపారు. రెండు లక్షల పెన్షన్లు కోత పెట్టారని విమర్శించారు. ప్రతి నెలా పెన్షన్లు తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో పింఛన్ల పంపిణీకి రూ.32,634 కోట్లు అవసరం కాగా, బడ్జెట్లో రూ.27,512 కోట్లు మాత్రమే కేటాయించారని, దీనినిబట్టి భవిష్యత్లో చాలా పెన్షన్లను తొలగించే అవకాశం ఉందని చెప్పకనే చెబుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే ఉద్దేశంతో చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు దాటిన వారికి ఏడాదికి రూ.18,750 చొప్పున ఐదేళ్ల పాటు అందించి వేలాది కుటుంబాలకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారని తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మహిళలను అన్ని విధాలా ఆదుకుంటే, కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందని ఇజ్రాయిల్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సేవాభావంతో వైద్య వృత్తి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైద్య విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, వైద్య వృత్తి సేవాభావంతో ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. మంగళవారం జరిగిన రాజమహేద్రవరం మెడికల్ కళాశాల ప్రథమ వార్షికోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కళాశాలలో గత ఏడాది వైద్య విద్యార్థులు 99 శాతం ఉత్తీర్ణత సాధించడం శుభపరిణామమని అన్నారు. కష్టపడి చదివి, వైద్యులైన తరువాత అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ‘సౌభాగ్య రక్త మిత్ర‘ లోగోను కలెక్టర్ ఆవిష్కరించారు. ఒకరు రక్తాన్ని దానం చేయడం వలన ముగ్గురికి ప్రాణ దానం చేయవచ్చని అన్నారు. వైద్యాధికారులు, వైద్య విద్యార్థులతో రక్తదాన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, అడిషనల్ డీఎంఈ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.సూర్యప్రభ, వైస్ ప్రిన్సిపాల్, కె.శివప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ కె.సూర్యారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వీవీ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
శృంగార వల్లభునికి రూ.28.10 లక్షల ఆదాయం