● మొదలైన పదో తరగతి పరీక్షలు
● తొలి రోజు 27,368 మంది హాజరు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 27,592 మందికిగాను తొలి రోజు నిర్వహించిన తెలుగు పరీక్షకు 27,368 మంది (97 శాతం) హాజరయ్యారు. 224 మంది పరీక్ష రాయలేదని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) పిల్లి రమేష్ తెలిపారు. విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 8.45 గంటల నుంచే విద్యార్థులను గేటు వద్ద పూర్తి స్థాయిలో తనిఖీ చేసి, ఆయా కేంద్రాల్లోకి అనుమతించారు. బ్యాగులు, ఎలక్ట్రానిక్స్ పరికరాలను అనుమతించలేదు. అన్ని కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించారు. కాకినాడ సాలిపేటలోని పైడా సత్యరాజు మున్సిపల్ హైస్కూల్లోని పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు 35 కేంద్రాల్లోను, డీఈఓ ఐదు కేంద్రాల్లోను, అసిస్టెంట్ ఎగ్జామ్స్ కమిషనర్ నాలుగు కేంద్రాల్లోను తనిఖీలు చేశారు.
దివ్యాంగ విద్యార్థుల అవస్థలు
పరీక్షలు రాయడానికి వచ్చిన దివ్యాంగ విద్యార్థులు అవస్థలకు గురయ్యారు. నగరంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అవి నాలుగైదు అంతస్తుల వరకూ ఉన్నాయి. వీటిలో పై అంతస్తులు కేటాయించడంతో మెట్లు ఎక్కి వెళ్లడానికి దివ్యాంగ విద్యార్థులు నానా అవస్థలూ పడ్డారు. వారికి కింది ఫ్లోర్లలో రూములు కేటాయించకపోవడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓపెన్ స్కూల్కు 27 మంది హాజరు
ఓపెన్ స్కూల్ పదో తరగతి విద్యార్థులకు సోమవారం హిందీ పరీక్ష నిర్వహించారు. దీనికి 42 మంది దరఖాస్తు చేసుకోగా 27 మంది హాజరయ్యారు. 15 మంది పరీక్ష రాయలేదని డీఈఓ రమేష్ తెలిపారు.