కదిలిస్తే.. కన్నీటి వేదన | - | Sakshi
Sakshi News home page

కదిలిస్తే.. కన్నీటి వేదన

Mar 18 2025 12:25 AM | Updated on Mar 18 2025 12:24 AM

పొలానికి దారి చూపండి

నాకు సర్వే నంబర్‌ 108/1లో 60 సెంట్ల పంట భూమి ఉంది. నా స్థలానికి, మెయిన్‌ రోడ్డుకు మధ్య ఉన్న స్థలంలో నాగు వీరభద్రరావు అనే వ్యక్తి రాజకీయ పలుకుబడి ఉయోగించి నాకు మార్గంగా ఉన్న స్థలాన్ని కబ్జా చేసి పాక వేశాడు. దీనివలన నాకు పొలంలోకి వెళ్లే మార్గం లేకుండా పోయింది. అధికారులు చెబితే పాక కూల్చేశారే తప్ప ఆ స్థలంలోని శిథిలాలను తీయడం లేదు. వీటిని తొలగించాలని కోరుతూ కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాను.

– కోరుకొండ సత్యనారాయణ,

రాజుపాలెం, పెదపూడి మండలం

వీఆర్‌ఓ ఇబ్బందులు

పెడుతున్నారు

గత ప్రభుత్వ హయాంలో నా భార్య విజయకుమారి పేరిట మాకు ఒకటిన్నర సెంట్ల భూమికి పట్టా ఇచ్చారు. పట్టా కూడా నా పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేశారు. దీనికి సంబంధించిన కాగితం ఇవ్వకుండా వీఆర్‌ఓ ఇబ్బందులు పెడుతున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఒరిజినల్‌ పట్టా నా వద్దనే ఉంది. అధికారులు వీఆర్‌ఓపై చర్యలు తీసుకొని, రిజిస్ట్రేషన్‌ పట్టా ఇప్పించాలంటూ జేసీకి అర్జీ అందజేశాను.

– బొల్లేజు నాగేశ్వరరావు, ఇంద్రపాలెం,

కాకినాడ రూరల్‌ మండలం

కలెక్టరేట్‌కు బాధితుల క్యూ

పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదుల వెల్లువ

సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీలు

అయినా పరిష్కారం

కాలేదంటూ ఆవేదన

కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రీడ్రెస్సల్‌ సిస్టమ్‌–పీజీఆర్‌ఎస్‌)లో సమస్యలు వెల్లువెత్తున్నాయి. ఈ వారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన పలువురిని ‘సాక్షి’ పలుకరించింది. ఎవరిని కదిపినా సమస్య పరిష్కారం కావడం లేదంటూ కన్నీటి వేదన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా వందలాది మంది ప్రతి వారం కలెక్టరేట్‌కు తరలివచ్చి తమ సమస్యలపై వినతులు అందిస్తున్నారు. వీటిని పరిష్కరిస్తున్నట్లు రికార్డుల్లో అధికారులు నమోదు చేస్తున్నారే తప్ప క్షేత్ర స్థాయిలో ఏ ఒక్క సమస్యా పరిష్కారం కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీఆర్‌ఎస్‌కు ప్రతి నెలా 470 నుంచి 500 పైగా అర్జీలు అందుతున్నాయి. వీటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను కలెక్టర్‌ షణ్మోహన్‌ ఆదేశిస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటోందని అంటున్నారు. ఏదైనా సమస్యపై అర్జీ అందజేస్తే గ్రామ స్థాయిలో వివిధ శాఖల అధికారులు తమను కార్యాలయాలకు రప్పించుకొని, సమస్య పరిష్కారమైందంటూ తమతో సంతకాలు చేయించుకుని, ఫొటోలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి తమ సమస్య తీరడం లేదని, మళ్లీ కలెక్టరేట్‌కు నెలల తరబడి తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు.

గత ప్రభుత్వ హయాంలో సమస్యపై ఫిర్యాదు చేస్తే అధికారులు నేరుగా ఇంటికి వచ్చి సమస్య పరిష్కరించేవారని చెబుతున్నారు. నాడు రేషన్‌ కార్డు, పింఛన్‌, ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణాలు, వివిధ సామాజికవర్గాల మహిళలకు ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ పథకాలు ఒక్కటి కూడా అమలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఏనాడూ మహిళలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూశారని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి, సూక్ష్మ రుణాల వైపు మొగ్గు చూపాల్సిన దుస్థితి దాపురించిందని అంటున్నారు. పింఛన్లు, ఇళ్ల పట్టాలు, రేషన్‌ కార్డులు, భూసర్వే వంటి సమస్యలపై 9 నెలలుగా కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదని చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వ నిబంధనలు చూస్తే ఏ ఒక్కరికీ పింఛన్‌ అందే పరిస్థితి కనిపించడం లేదని నిరాశ చెందుతున్నారు. ఒక ఇంట్లో పింఛన్‌దారు చనిపోతేనే మరొకరికి పింఛన్‌ వస్తుందంటున్నారు తప్ప అర్హులైన మర్వెరికీ పింఛన్‌ అందే పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. ఇలా వివిధ సమస్యలపై ప్రజలు అధికారుల వద్ద ఏకరువు పెట్టుకుంటున్న దృశ్యాలు ప్రతి వారం జరుగుతున్న పీజీఆర్‌ఎస్‌లో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.

దివ్యాంగ పింఛన్‌ ఇప్పించండి

నేను దివ్యాంగురాలిని, వితంతువును. కుడి కాలు, కుడి చెయ్యి పని చేయదు. నాకు వితంతు పింఛన్‌ మాత్రమే ఇస్తున్నారు. దివ్యాంగ పింఛన్‌ ఇప్పించాలని మూడు దఫాలుగా అధికారులకు అర్జీ అందజేస్తున్నాను. అధికారులు స్పందించి నాకు వెంటనే దివ్యాంగ పింఛన్‌ రూ.6 వేలు, 35 కేజీల బియ్యం ఇప్పించాలని కోరుతున్నాను.

– ఒసుపల్లి వేగులమ్మ,

దుమ్ములపేట, కాకినాడ అర్బన్‌

రేషన్‌ కార్డులో పేరు తొలగించండి

మా అమ్మగారిది కరప మండలం ఉప్పలంక గ్రామం. నాకు పెళ్‌లై ఇద్దరు అబ్బాయిలు. నా భర్త వేట సాగిస్తారు. మేము యానాం అయ్యన్న నగర్‌లో ఉంటున్నాం. మా అమ్మగారి రేషన్‌ కార్డులో నా పేరు ఉండిపోవడంతో యానాంలో మాకు రేషన్‌ కార్డు ఇవ్వడం లేదు. ఇక్కడి రేషన్‌ కార్డులో నా పేరు తొలగించి, నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదు. దీనిపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశాను.

– పట్టా సునీత, ఉప్పలంక, కాకినాడ రూరల్‌

వితంతు పింఛన్‌ ఇప్పించరూ..

నా భర్త చనిపోయి రెండేళ్లయ్యింది. అప్పటి నుంచీ వితంతు పింఛన్‌ మంజూరు చేయాలంటూ అధికారులకు దరఖాస్తులు అందిస్తూనే ఉన్నాను. ఇప్పటికీ పెన్షన్‌ మంజూరు కాలేదు. బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పింఛన్‌ మంజూరు చేయాలని కోరుతూ అధికారులకు మరోసారి దరఖాస్తు చేశాను.

– పాలకొండ నిర్మలాదేవి,

39వ డివిజన్‌, కాకినాడ అర్బన్‌

కదిలిస్తే.. కన్నీటి వేదన1
1/6

కదిలిస్తే.. కన్నీటి వేదన

కదిలిస్తే.. కన్నీటి వేదన2
2/6

కదిలిస్తే.. కన్నీటి వేదన

కదిలిస్తే.. కన్నీటి వేదన3
3/6

కదిలిస్తే.. కన్నీటి వేదన

కదిలిస్తే.. కన్నీటి వేదన4
4/6

కదిలిస్తే.. కన్నీటి వేదన

కదిలిస్తే.. కన్నీటి వేదన5
5/6

కదిలిస్తే.. కన్నీటి వేదన

కదిలిస్తే.. కన్నీటి వేదన6
6/6

కదిలిస్తే.. కన్నీటి వేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement