ఇచ్చేది పదుల్లో.. ఖర్చు వందల్లో | - | Sakshi
Sakshi News home page

ఇచ్చేది పదుల్లో.. ఖర్చు వందల్లో

Mar 17 2025 12:09 AM | Updated on Mar 17 2025 12:09 AM

ఇచ్చే

ఇచ్చేది పదుల్లో.. ఖర్చు వందల్లో

రాయవరం: పదవ తరగతి పరీక్షల నిర్వహణ చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులకు పరీక్షగా మారుతోంది. ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు కేటాయించే సొమ్ము ఒక్కో విద్యార్థికి రూ.పదుల్లో ఉంటుండగా, ఖర్చు రూ.వందల్లో అవుతుందనే విమర్శలున్నాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా పరీక్షల నిర్వహణ ఖర్చుల భారం ఉంటోందని పలువురు చీఫ్‌లు, డీవోలు వాపోతున్నారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణ కేటా యింపులు పెంచాలని, ఇన్విజిలేటర్లకు ఇచ్చే రెమ్యూనరేషన్‌ను పెంచాలని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఇంటర్‌ పరీక్షలకు ఇచ్చే విధంగా రెమ్యునరేషన్‌ ఉండాలనే డిమాండ్‌ ఉపాధ్యాయుల నుంచి విన్పిస్తోంది.

ఒక్కో విద్యార్థికి రూ.1.42 కేటాయింపు

పరీక్షల నిర్వహణకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.1.42 వంతున ఏడు పరీక్షలకు రూ.10 మంజూరు చేస్తున్నారు. 2018లో ఒక్కో విద్యార్థికి కంటింజెంట్‌ చార్జీగా రూ.5.50 ఇవ్వగా, 2023లో ఒక్కో విద్యార్థికి రూ.8 ఇస్తున్న కంటింజెంట్‌ చార్జీని గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రూ.8 నుంచి రూ.10కి పెంచింది. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువులను దృష్టిలో ఉంచుకుని కంటింజెంట్‌ చార్జీలను పెంచాలనే డిమాండ్‌ను ఉపాధ్యాయ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. పరీక్ష కేంద్రంలో పరీక్షలను పర్యవేక్షించే చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారి పోలీస్‌ స్టేషన్‌ నుంచి పరీక్షా పత్రాలు తీసుకువచ్చి పరీక్ష అనంతరం సమాధాన పత్రాలను సీల్‌ చేస్తారు. ఇంగ్లిష్‌, ఉర్దూ మీడియంలకు వేర్వేరుగా సంచులు వాడతారు. ఒక్కో సంచికి రెండు నుంచి మూడు మీటర్ల వస్త్రాన్ని, జవాబు పత్రాలను పోస్టాఫీసుకు తీసుకుని వెళ్లడానికి రవాణా ఖర్చులను భరించాల్సి వస్తోంది. జవాబు పత్రాలను కట్టి భద్రపరిచేందుకు లక్క, కొవ్వొత్తి, దారం, స్కెచ్‌ పెన్నులు, స్టాప్‌లర్లు, గమ్‌, వైట్‌నర్‌ తదితర వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పరీక్షా కేంద్రంలో మంచినీరును అందుబాటులో ఉంచాలి. ఇలా అన్ని వస్తువులను కొనాలంటే ఎంతలేదన్నా రోజుకు రూ.600కు పైగా ఖర్చవుతుందని చీఫ్‌లు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.1.42 ఇస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు.

సీఎస్‌లపైనే ఆర్థిక భారం

ప్రతి పరీక్షా కేంద్రంలో నిర్వహణ బాధ్యత చీఫ్‌ సూపరింటెండెంట్లదే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పదవ తరగతి పరీక్షకు 386 మంది చీఫ్‌లు హాజరవుతున్నారు. ప్రభుత్వం నిధులను తక్కువగా విడుదల చేస్తుండడంతో అదనంగా అయ్యే ఖర్చును వారి చేతి నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తోంది. రోజుకు రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా భరించాల్సి ఉంటుందని పలువురు చీఫ్‌లు చెబుతున్నారు. ఒక్కో విద్యార్థికి కనీసం రూ.15 ఇవ్వాలని, అదనంగా రవాణా చార్జీలు మంజూరు చేయాలని చీఫ్‌లు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇన్విజిలేటర్లకూ అంతంత మాత్రమే

ఇంటర్‌ పరీక్షల్లో ఇన్విజిలేటర్లకు రోజుకు రూ.150 వంతున రెమ్యూనరేషన్‌ ఇస్తుండగా, పదవ తరగతి ఇన్విజిలేషన్‌కు మాత్రం రోజుకు కేవలం రూ.33 ఇస్తున్నారు. అటెండర్‌కు రూ.20, వాటర్‌ బాయ్‌కి రూ.17 వంతున భృతిని చెల్లిస్తున్నారు. గత ప్రభుత్వం అంతకుముందు కంటే సీఎస్‌, డీవోలకు రూ.22, ఇన్విజిలేటర్లు, క్లర్క్స్‌కు రూ.11, అటెండర్లకు రూ.6.80, వాటర్‌మెన్‌కు రూ.6 వంతున పెంపుదల చేసింది. కాగా ఇంటర్‌ పరీక్షలకు, పది పరీక్షలకు పెద్దగా తేడా లేకున్నా, రెమ్యూనరేషన్‌ చెల్లింపులో మాత్రం తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పెరుగుతున్న ధరలకు తోడు సరిపడా నిర్వహణ ఖర్చులు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు ఇన్విజిలేటర్లు ఆవేదన చెందుతున్నారు. ఫీజుల వసూలు విషయానికి వస్తే మాత్రం ఒక్కో విద్యార్థి నుంచి రూ.125 వంతున వసూలు చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఉన్న పరీక్షా కేంద్రాలు : 386

హాజరయ్యే విద్యార్థులు : 73,329

చీఫ్‌, డీవో, కస్టోడియన్లకు రోజుకు ఇచ్చేది : రూ. 66

ఇన్విజిలేటర్లకు రోజుకు ఇచ్చేది : రూ.33

క్లర్కులకు రోజుకు ఇచ్చేది : రూ. 33

అటెండర్‌కు ఇచ్చేది : రూ.20

వాటర్‌ మెన్లకు రోజుకు ఇచ్చేది : రూ.17

పది పరీక్షల్లో వినియోగించే కంటింజెంట్‌ సామగ్రి

పది పరీక్షల నిర్వహణపై

ప్రభుత్వం చిన్నచూపు

2023లో పెంచిన జగన్‌ సర్కార్‌

ఒక విద్యార్థికి ప్రస్తుతం ఇస్తున్న

కంటింజెంట్‌ చార్జీ రూ.10

రెమ్యూనరేషన్‌ పెంచాలంటున్న యూనియన్లు

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏదీ..

పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం చేస్తున్న కేటాయింపులు చూస్తుంటే ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది. ఒక విద్యార్థికి ఒక పేపరుకు రూ.1.42 కంటింజెంట్‌ చార్జీగా ఏ విధంగా సరిపోతాయో చెప్పాలి. కష్టమైన బాధ్యతలు నిర్వహించేవారికి గౌరవప్రదంగా రెమ్యునరేషన్‌ చెల్లించాలి.

– పి.సురేంద్రకుమార్‌, జిల్లా అధ్యక్షుడు,

యూటీఎఫ్‌, కపిలేశ్వరపురం

ప్రస్తుత రేట్లకు అనుగుణంగా ఇవ్వాలి

పెరుగుతున్న నిత్యావసర వస్తువులకు అనుగుణంగా రెమ్యునరేషన్‌ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు కంటింజెంట్‌ చార్జి పరీక్షల నిర్వహణకు ఏ మూలకూ సరిపోవడం లేదు. ప్రభుత్వం వెంటనే సీఎస్‌, డీవోలతో పాటుగా ఇన్విజిలేటర్లకు కనీస చార్జీలు చెల్లించక పోవడం దురదృష్టకరం. వెంటనే ప్రభుత్వం రెమ్యునరేషన్‌ పెంచాలి.

– విత్తనాల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి,

గెజిటెడ్‌ హెడ్మాస్టర్స్‌ అసోసియేషన్‌, అమలాపురం

రెమ్యూనరేషన్‌ను తక్షణం పెంచాలి

ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు చేస్తున్న కేటాయింపులు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇన్విజిలేటర్లకు రోజుకు కనీసం రూ.150, ఛీఫ్‌, డీవో, కస్టోడియన్లకు రోజుకు రూ.200 వంతున కేటాయించాలి. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలి.

– నరాల కృష్ణకుమార్‌, జిల్లా అధ్యక్షుడు,

పీఆర్‌టీయూ, ద్రాక్షారామ

టీఏ, డీఏలు చెల్లించాలి

దూరంతో సంబంధం లేకుండా సీఎస్‌, డీవోలకు, ఇన్విజిలేటర్లకు టీఏ, డీఏలు చెల్లించాలి. రెమ్యూనరేషన్‌ కచ్చితంగా పెంచాలి. స్పాట్‌ వాల్యుయేషన్‌ చేసే స్పెషల్‌ అసిస్టెంట్లకు కూడా టీఏ, డీఏలు చెల్లించాలి.

– పోతంశెట్టి దొరబాబు, జిల్లా అధ్యక్షుడు,

ఎస్‌టీయూ, అమలాపురం

ఇచ్చేది పదుల్లో.. ఖర్చు వందల్లో1
1/4

ఇచ్చేది పదుల్లో.. ఖర్చు వందల్లో

ఇచ్చేది పదుల్లో.. ఖర్చు వందల్లో2
2/4

ఇచ్చేది పదుల్లో.. ఖర్చు వందల్లో

ఇచ్చేది పదుల్లో.. ఖర్చు వందల్లో3
3/4

ఇచ్చేది పదుల్లో.. ఖర్చు వందల్లో

ఇచ్చేది పదుల్లో.. ఖర్చు వందల్లో4
4/4

ఇచ్చేది పదుల్లో.. ఖర్చు వందల్లో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement