
శృంగార వల్లభుని సన్నిధిలో రద్దీ
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. వివిధ సేవలు, కేశఖండన, అన్నదాన విరాళాలుగా స్వామి వారికి రూ.4,01,587 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఐదు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశారు.
అర్జీలను నూరు శాతం
పరిష్కరించాలి
కాకినాడ సిటీ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను గడువులోపు నూరు శాతం పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి అధికారి జి.వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. వివిధ అంశాలపై ఆయన కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా అటవీ శాఖ అధికారి ఎ.రవీంద్రనాథ్రెడ్డి, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన తదితరులతో కలిసి పలు శాఖల జిల్లా అధికారులు, పథకాల లబ్ధిదారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో డీఆర్ఓ జె.వెంకటరావు, కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓలు ఎస్.మల్లిబాబు, కె.శ్రీరమణి, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీ చైత్రవర్షిణి, సీపీఓ పి.త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఫారెస్ట్ రేంజ్
ఆఫీసర్స్ పరీక్ష
కాకినాడ సిటీ: ఏపీపీఎస్సీ ఆధ్వర్యాన ఆదివారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఆర్ఓ జె.వెంకటరావు తెలిపారు. స్థానిక ఎస్.అచ్యుతాపురంలోని అయాన్ డిజిటల్ జోన్ సాఫ్ట్ టెక్నాలజీస్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆయన, ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, ఇతర అధికారులు శనివారం పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో ఏపీపీఎస్సీ, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో డీఆర్ఓ మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగే ఈ పరీక్షకు 464 మంది హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించామన్నారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రానికి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.
స్వయం ఉపాధికి
దరఖాస్తుల ఆహ్వానం
కాకినాడ సిటీ: బీసీ, ఈబీసీ సామాజిక వర్గాల వారికి స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. బీసీలకు రూ.2 లక్షల వరకూ యూనిట్లకు 50 శాతం సబ్సిడీ లేదా రూ.75 వేలు మించకుండా మిగిలినది ఆర్థిక సాయంగా అందిస్తారన్నారన్నారు. జనరిక్ మెడికల్ షాపు యూనిట్కు రూ.8 లక్షలు, సబ్సిడీ రూ.4 లక్షలు పోను, మిగిలిన సొమ్ము బ్యాంకు రుణంగా అందిస్తారని తెలిపారు. మేదర, కుమ్మరి, శాలివాహన వారికి బుట్టల అల్లకం, కుండల తయారీ కింద యూనిట్ కాస్ట్ రూ.3 లక్షలు, సబ్సిడీ రూ.1.50 లక్షలు అందిస్తారని వివరించారు. ఆర్యవైశ్య, రెడ్డి, క్షత్రియ, కమ్మ, బ్రాహ్మణ, ఈబీసీ వర్గాల వారికి యూనిట్కు రూ.2 లక్షల వరకూ ఇస్తారని, ఇందులో 50 శాతం సబ్సిడీ లేదా రూ.75 వేలు మించకుండా ఆర్థిక సహాయం అందిస్తారని పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గాల వారికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ రుణం ఇస్తారని, ఇందులో 50 శాతం సబ్సిడీ ఉంటుందని తెలిపారు. ఎంఎస్ఎంఈ పథకం కింద రూ.25 లక్షల యూనిట్కు రూ.10 లక్షల బ్యాంకు రుణం, రూ.10 లక్షల సబ్సిడీ ఇస్తారని, లబ్ధిదారు రూ.5 లక్షలు భరించాలని పేర్కొన్నారు. ఈ రుణాలకు 21 నుంచి 60 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. రైస్ కార్డు కలిగి ఉండాలని కమ్యూనిటీ సర్టిఫికెట్ తప్పనిసరని తెలిపారు. మహిళలకు స్వయం ఉపాధి పథకంలో ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చి, కుట్టుమెషీన్ ఉచితంగా అందిస్తారని శ్రీనివాసరావు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 22 చివరి తేదీ అని, ఆసక్తి ఉన్నవారు గ్రామ సచివాలయాలు, నెట్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.