హక్కులకు రక్షణ కవచం | - | Sakshi
Sakshi News home page

హక్కులకు రక్షణ కవచం

Mar 15 2025 12:34 AM | Updated on Mar 15 2025 12:33 AM

కాకినాడ వినియోగదారుల కమిషన్‌

పరిధిలో కేసుల వివరాలు

సంవత్సరం వచ్చిన పరిష్కార విచారణలో

కేసులు మైనవి ఉన్నవి

2017 48 48 0

2018 53 52 1

2019 35 35 0

2020 31 30 1

2021 48 45 3

2022 70 67 3

2023 84 72 12

2024 93 49 44

2025 22 0 22

కాకినాడ లీగల్‌: సొంత అవసరాల కోసం పలు రకాల వస్తువులకు, సేవలకు నిర్దేశిత డబ్బు చెల్లించిన ప్రతి ఒక్కరూ వినియోగదారులే. ఆ వస్తువు, సేవలు సంతృప్తికరంగా లేకుంటే మోసపోయినట్టే. ఆ మోసాన్ని భరించి, నష్టపోవడంకన్నా, పోరాడితే పరిహారం పొందడమే కాకుండా, మరొకరు మోసపోకుండా ఉండే అవకాశం కలుగుతుంది. వస్తువుకు సంబంధించిన సమాచారం పొందడం, నచ్చిన వస్తువును ఎంచుకునే అవకాశం కల్పించడం, వినియోగదారుకు రక్షణ కల్పించడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్‌ కెన్నడీ తొలిసారిగా 1962 మార్చి 15న అమెరికన్‌ కాంగ్రెస్‌లో ప్రసంగించారు. తదనంతర కాలంలో ఈ అంశాలకు ప్రాధాన్యం పెరగడంతో 1983 నుంచి ఏటా మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినం నిర్వహిస్తున్నారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం 1986లో ప్రత్యేక చట్టం తీసుకువచ్చి, వినియోగదారుల కమిషన్‌ ఏర్పాటు చేసింది. వస్తు, సేవల్లో నష్టపోయిన వినియోగదారులు కమిషన్‌లో నామమాత్రపు రుసుంతో కేసు వేసి, తగిన పరిహారం పొందవచ్చు.

ఏ సందర్భాల్లోనంటే..

● కొనుగోలు చేసిన వస్తువులు, మందులు, ఇతర ఉత్పత్తులతో ప్రాణ, ఆస్తినష్టం కలిగినా..

● ఆసుపత్రుల్లో సేవా లోపంతో ఇబ్బంది కలిగినా..

● వినియోగించే వస్తువుల నాణ్యత, స్వచ్ఛత లోపించినా..

● నకిలీ విత్తనాలు, ఇతల అనైతిక వాణిజ్య

విధానాలు.

● వ్యాపారి లేదా డీలర్‌ ద్వారా నష్టపోయినా..

● అసలు ధర కంటే ఎక్కువ వసూలు చేసినా..

● బ్యాంకు, బీమా, రవాణా, తయారీ సేవల్లో లోపాలు జరిగినా..

● అపార్ట్‌మెంట్ల విక్రయాల్లో మోసం, ఇంటి నిర్మాణంలో లోపాలు.

● వినోదం, వివిధ వృత్తి సేవల్లో లోపాలు.

● ఇతర కారణాలతో నష్టపోయినా..

నోటీసు పంపాలిలా..

● కొనుగోలు చేసిన ఉత్పత్తి లేదా సర్వీస్‌ ప్రొవైడర్‌ కంపెనీ పూర్తి చిరునామా రాయాలి.

● కొన్న వస్తువు లేదా సేవల వివరాలివ్వాలి. క్యాష్‌ మెమో నంబర్‌, తేదీ ఇవ్వాలి.

● సంస్థ ఇచ్చిన వారెంటీ లేదా గ్యారెంటీ వివరాలు తెలపాలి.

● వస్తువు లేదా సేవలో జరిగిన లోపం, దానివల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను విపులంగా వివరించాలి.

● ఈ ఇబ్బందులపై అప్పటి వరకూ ఎవరెవరికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేశారో పేర్కొనాలి. ఉంటే కంప్లయింట్‌ నంబర్‌ ఇవ్వాలి. ఈ సంప్రదింపులకు సంబంధించిన ఆధారాల జిరాక్స్‌ పత్రాలు నోటీసుకు జత చేయడం మంచిది.

● నోటీసుకు స్పందించడానికి సంబంధిత సంస్థ లేదా వ్యక్తికి 15 నుంచి 30 రోజుల వరకూ గడువు ఇవ్వాలి.

● కోరుతున్న నష్టపరిహారం, పూర్తి మొత్తం కోరితే దానికి 18 శాతం వరకూ వడ్డీ లేదా కొత్త వస్తువు ఇవ్వాలని కోరవచ్చు. దానికి నష్టపరిహారం కూడా కావాలని కోరవచ్చు.

● వినియోగదారు పూర్తి పేరు, అడ్రస్‌ ఇవ్వాలి.

● నోటీసు అవతలి వ్యక్తి లేదా సంస్థకు ఇచ్చినట్లు వినియోగదారు వద్ద తగిన అకనాలెడ్జ్‌మెంట్‌ లేదా కొరియర్‌, హ్యాండ్‌, ఆన్‌లైన్‌ డెలివరీ వంటి ఆధారాలు ఉండాలి. ఈ ఆధారాన్ని కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది.

ఫిర్యాదు ఇలా..

వస్తు, సేవల కొనుగోలు సందర్భంగా నష్టపోయిన వారు వినియోగదారుల కమిషన్‌లో నేరుగా లేదా న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అక్కడి సహాయ కేంద్రం సలహాలు తీసుకుని కేసు దాఖలు చేయవచ్చు. గతంలో వస్తువు కొనుగోలు చేసిన ప్రాంతంలోనే కేసు దాఖలు చేయాల్సి ఉండేది. 2019 వినియోగదారుల రక్షణ చట్టంలో మార్పు అనంతరం.. వస్తువు ఎక్కడ కొన్నా తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో కేసు దాఖలు చేసే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించారు. అలాగే, ఒక వస్తువు సరిగ్గా పని చేయకపోతే గతంలో కంపెనీపై మాత్రమే కేసు వేసేవారు. చట్టంలో మార్పు అనంతరం వస్తువు విక్రయించిన షాపు యాజమాని, ఏజెన్సీ, కంపెనీపై కూడా కేసు దాఖలు చేసే అవకాశం కలిగింది.

ఈ జాగ్రత్తలు మేలు

● అవసరమైన వస్తువులనే ఎంపిక చేసి, కొనుగోలు చేయాలి. ఆ వస్తువుల పూర్తి సమాచారం తెలుసుకోవాలి.

● మోసపూరిత ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలి.

● నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. ఆఫర్లను పూర్తిగా పరిశీలించుకోవాలి.

● వస్తువులు, సేవల కొనుగోలుకు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి.

● గ్యారంటీ లేదా వారంటీ కార్డులపై సంబంధిత విక్రేత సంతకం, ముద్ర సహా ఉండేలా చూసుకోవాలి.

● మోసానికి గురైతే వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించడానికి ఇవి ఉపయోగపడతాయి.

వస్తు, సేవల్లో లోపాలకు

పరిహారం పొందే అవకాశం

నష్టం వాటిల్లితే కమిషన్‌ అండ

అవగాహనే శ్రీరామరక్ష

నేడు ప్రపంచ వినియోగదారుల

హక్కుల దినం

ఆధారాలు భద్రపరచుకోవాలి

కొనుగోలు సమయంలో వినియోగదారులు బిల్లులు, గ్యారంటీ కార్డు, జాబ్‌కార్డు తప్పనిసరిగా తీసుకుని భద్రపరచుకోవాలి. సేవా లోపం జరిగితే కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. కేసు స్వీకరించిన 90 రోజుల్లో పరిష్కారం లభించేలా కృషి చేస్తాం. రూ.5 లక్షలలోపు విలువగల కేసులు కమిషన్‌లో పూర్తిగా ఉచితం. ఆపై నిర్ణీత రుసుములుంటాయి. కమిషన్‌ వద్ద రూ.50 లక్షల వరకూ కూడా కేసులు వేయవచ్చు. వాటికి ఎంత వరకూ అయినా పరిహారం పొందవచ్చు.

– చెరుకూరి రఘుపతి వసంత్‌కుమార్‌, అధ్యక్షుడు, కాకినాడ జిల్లా వినియోగదారుల కమిషన్‌–1

వెంటనే స్పందిస్తాం

వినియోగదారులు ఆన్‌లైన్‌లో కూడా కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఎటువంటి సమస్యలున్నా తగిన ఆధారాలతో కమిషన్‌ను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుంది.

– చెక్కా సుశీ, సభ్యులు, కాకినాడ

జిల్లా వినియోగదారుల కమిషన్‌

వీరికి ఉచితం

అంత్యోదయ కార్డు ఉన్న వారికి వినియోగదారుల కమిషన్‌లో సేవలు ఉచితంగా అందుతాయి. కేసును వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తాం.

– చాగంటి నాగేశ్వరరావు,

సభ్యుడు, కాకినాడ జిల్లా వినియోగదారుల

కమిషన్‌

అదనపు వసూలు రూ.27.. కమిషన్‌ వడ్డన రూ.27.27 లక్షలు

కాకినాడ రూరల్‌ గంగానపల్లి చెందిన నున్నా కుసుమ కల్యాణ్‌ 2023 డిసెంబర్‌ 8న హైదరాబాద్‌ బోడుప్పల్‌ ప్రాంతంలోని హోటల్‌ ట్యూలిప్స్‌ గ్రాండ్‌లో బిర్యానీలు, డ్రింకులు, మూడు మినరల్‌ వాటర్‌ బాటిళ్లు జొమాటో డైనింగ్‌ పే ద్వారా కొనుగోలు చేశాడు. వాటికి రూ.3,083 చెల్లించాడు. వాటర్‌ బాటిల్‌ ఎంఆర్‌పీ రూ.20 కాగా, ఆ హోటల్‌ నిర్వాహకులు రూ.29 వసూలు చేశారు. మూడు వాటర్‌ బాటిళ్లకు రూ.60 కాగా, అదనంగా రూ.27 కలిపి మొత్తం రూ.87 వసూలు చేశారు. దీనిపై కల్యాణ్‌ తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపగా హోటల్‌ యాజమాన్యం స్పందించలేదు. దీంతో ఆయన కాకినాడ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ అనంతరం కల్యాణ్‌కు రూ.25 వేల సష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చులు రూ.2 వేలు ఇవ్వాలని, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.27 లక్షలు చెల్లించాలని గత ఫిబ్రవరి 28న కమిషన్‌ తీర్పు ఇచ్చింది.

రూ.5కు కక్కుర్తి..

రూ.5 లక్షలు పైగా వదిలింది

కాకినాడకు చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్లి, సెల్‌ఫోన్‌ డిపాజిట్‌ చేశారు. మొబైల్‌ డిపాజిట్‌ కౌంటర్లో సెల్‌ ఫోన్‌ పెడితే రూ.5 తీసుకోవాలి. కానీ, రూ.10 గుంజారు. దీనిపై లక్ష్మీనారాయణ కాకినాడ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఆయనకు రూ.5తో పాటు మానసిక ఒత్తిడికి గురైనందుకు రూ.15 వేలు, కోర్టు ఖర్చులకు మరో రూ.5 వేలు, అలాగే, దేవస్థానానికి మరో రూ.5 లక్షల జరిమానాను సంబంధిత కాంట్రాక్టర్‌ చెల్లించాలంటూ గత ఫిబ్రవరి 11న కమిషన్‌ తీర్పు చెప్పింది.

స్కూల్‌ సర్టిఫికెట్‌ ఇవ్వనందుకు..

కాకినాడ చెందిన పీవీఎస్‌ఎస్‌ శ్రీనివాస్‌కు ముగ్గురు కుమార్తెలు. 2018–19లో స్థానిక రామారావుపేట నారాయణ స్కూల్‌లో చదివేవారు. ఆ సమయంలో స్కూల్‌ ఫీజులతో పాటు పుస్తకాలకు కూడా శ్రీనివాస్‌ చెల్లించారు. ఇతర కారణాలతో ఆయన తన పిల్లలను అదే సంవత్సరం అదే ప్రాంతంలోని మున్సిపల్‌ స్కూల్లో చేర్చారు. పిల్లల స్కూల్‌ సర్టిఫికెట్‌ కావాలని కోరగా, మొత్తం ఫీజులు చెల్లించాలని శ్రీనివాస్‌కు ప్రిన్సిపాల్‌ చెప్పారు. దీనిపై శ్రీనివాస్‌ 2019లో వినియోగదారుల కమిషన్‌లో కేసు వేశారు. విచారణ అనంతరం శ్రీనివాస్‌ పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వాలని, మానసిక వ్యధకు గురి చేసినందుకు రూ.5 వేల పరిహారం, కోర్టు ఖర్చులుగా రూ.2 వేలు చెల్లించాలని నారాయణ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను ఆదేశిస్తూ 2022 మే 12న కమిషన్‌ అధ్యక్షుడు చెరుకూరి రఘుపతి వసంత్‌ కుమార్‌, సభ్యులు తీర్పు చెప్పారు.

డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందే..

రాజమహేంద్రవరం ఐిసీఐసీఐ బ్యాంక్‌లో కాకినాడ రూరల్‌, రమణయ్యపేట చెందిన జంపన చంద్రశేఖర్‌వర్మ 2006లో ఇంటి రుణం తీసుకున్నారు. రుణం పూర్తిగా చెల్లించినా ఇంటి ఒరిజినల్‌ డాక్యుమెంట్లను బ్యాంకు అధికారులు తిరిగి ఇవ్వలేదు. చంద్రశేఖర్‌వర్మ 2019లో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ అనంతరం ఒరిజినల్‌ డాక్యుమెంట్లతో పాటు రూ.లక్ష పరిహారం, ఖర్చుల కింద రూ.8 వేలు చెల్లించాలని 2022 ఆగస్టులో కమిషన్‌ తీర్పు చెప్పింది.

ల్యాబ్‌ తప్పుడు

రిపోర్టుకు పరిహారం

కాకినాడ చెందిన 85 ఏళ్ల యు.పద్మనాభరావు 2017లో స్థానిక థర్డ్‌ ఐ ఇమేజింగ్‌ డయాగ్నోస్టిక్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ల్యాబ్‌ వారు తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో పద్మనాభరావు 2018లో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఆయనకు నష్టపరిహారంగా రూ.లక్ష, ఖర్చులుగా రూ.5 వేలు చెల్లించాలని 2022 అక్టోబర్‌లో కమిషన్‌ తీర్పు ఇచ్చింది.

అంతర్వేది రథం దగ్ధం కేసులో..

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింస్వామి దేవస్థానంలో ప్రమాదవశాత్తూ దగ్ధమైన రథానికి బీమా చెల్లించాలంటూ అధికారులు కాకినాడ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. వాదోపవాదాల అనంతరం రూ.84 లక్షల పరిహారం, ఖర్చుల కింద రూ.30 వేలు చెల్లించాల్సిందిగా యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీని ఆదేశిస్తూ గత ఏడాది జనవరిలో కమిషన్‌ తీర్పు ఇచ్చింది.

పంటల బీమా చెల్లించాలి

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలో భాగంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీపీసీబీ) 14,153 మంది రైతుల నుంచి రూ.1 చొప్పున 2019లో ప్రీమియం వసూలు చేసి, ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి చెల్లించింది. తుపాను కారణంగా పంట నష్టం జరగడంతో పంటల బీమా చెల్లించాలని కోరగా ఆ కంపెనీ నిరాకరించింది. దీనిపై వినియోగదారులు కమిషన్‌ను డీసీసీబీ ఆశ్రయించింది. విచారణ అనంతరం నష్టపోయిన రైతులందరికీ రూ.15.72 కోట్ల పంట నష్ట పరిహారంతో పాటు ఖర్చుల కింద రూ.50 వేలు చెల్లించాల్సిందిగా ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీని 2023 ఫిబ్రవరిలో కమిషన్‌ ఆదేశించింది.

హక్కులకు రక్షణ కవచం1
1/3

హక్కులకు రక్షణ కవచం

హక్కులకు రక్షణ కవచం2
2/3

హక్కులకు రక్షణ కవచం

హక్కులకు రక్షణ కవచం3
3/3

హక్కులకు రక్షణ కవచం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement