 
															కేటీదొడ్డి స్టేషన్లోకలకలం రేపిన అక్రమ వసూళ్ల వ్యవహారం
గద్వాల క్రైం: జాతర నేపథ్యంలో చిరు వ్యాపారుల నుంచి.. సరిహద్దు వద్ద నిషేధిత పదార్థాలు, ఇసుక, ధాన్యం తదితరవి తరలించే వారి నుంచి కొందరు పోలీసులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తాజాగా కేటీదొడ్డి మండలంలోని పాగుంట లక్ష్మీవేంకటేశ ్వర స్వామి జాతర నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటనలు ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. జాతరలో చిరు వ్యాపారులు, ఆట వస్తువులు ఏర్పాటుచేసుకొనే వారి నుంచి చేసిన వసూళ్ల పంపకాల్లో బేధాభిప్రాయాలు రావడంతో కేటీదొడ్డి పోలీసు స్టేషన్ అధికారుల వ్యవహారం జిల్లాలో హాట్టాపిక్గా మారింది. దీంతో ఎస్పీ శ్రీనివాసరావు రెండు రోజుల క్రితం కానిస్టేబుల్ రజినిబాబుపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటూ జిల్లా సాయుధ బలగాల కార్యాలయానికి ఆటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడితో సమస్య సమసిపోయింది అనుకునేలోపే సదరు కానిస్టేబుల్ మరో బాంబు పేల్చాడు. ఉన్నతాధికారుల సూచనల మేరకే జాతరలో వసూళ్లు చేశానని, చేయని తప్పుకు తనని బాధ్యుడిని చేశారని, స్థానిక ఎస్ఐ పేరు వెల్లడించి సూసైడ్ చేసుకుంటానని పోలీస్ వాట్సాప్ గ్రూపులో వరుస పోస్టులు చేయడం గమనార్హం. ఈ పోస్టులు పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో జిల్లా పోలీసుశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కేటీదొడ్డి ఎస్ఐ బిజ్జ శ్రీనివాసులును జిల్లా సాయుధ బలగాల కార్యాలయానికి అటాచ్ చేస్తు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సరిహద్దు అడ్డాగా..
రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న కేటీదొడ్డి పోలీసు స్టేషన్ సిబ్బంది విషయంలో జిల్లా పోలీసు శాఖ నిత్యం విమర్శలు ఎదుర్కొంటుంది. వివిధ మార్గాల్లో అక్రమార్కులు అనుమతి లేని వస్తువులు, ముడి సరుకులు, నిషేధిత మత్తు పదార్థాలను ఈ మార్గంలో రవాణా చేస్తుంటారు. వీటిని కట్టడి చేయాలంటే పోలీసు, ఎకై ్సజ్, రెవెన్యూ ఆయా శాఖలు సంయుక్తంగా విధులు నిర్వహిస్తుంటారు. అయినప్పటికి కొందరు అక్రమార్కులు ఆయా శాఖల అధికారులతో నెల నెల కొంత డబ్బులు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు మట్టి, ఇసుక, రేషన్ బియ్యం మాఫియా సైతం వీరికి వెన్నుదన్నుగా ఉన్నారని సమాచారం. ఈక్రమలో కేటీదొడ్డి ఎస్ఐగా బిజ్జ శ్రీనివాసులు గత ఏడాది సెప్టెంబర్లో బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి అనుమతులు లేకుండా వ్యాపారం చేసే ఇసుక, మట్టి, రేషన్ బియ్యం మాఫియాతో మామూళ్ల ప్రక్రియకు తెర తీశాడనే విమర్శలు ఉన్నాయి. కర్ణాటక నుంచి రాష్ట్ర సరిహద్దులోకి వచ్చే అనుమతి లేని వాహనాల యాజమానులతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఎస్ఐ తీరుపై డీజీపీ, ఎస్పీకి సైతం కొందరు ఫిర్యాదులు చేశారు. ఊట్కూర్లో విధుల్లో అలసత్వం వహించిన నేపథ్యంలో పోలీసుశాఖ అప్పట్లో ఆయనపై చర్యలు తీసుకుంది. ఈ విషయం అప్పట్లో రాష్ట్ర స్థాయిలో చర్చకు దారి తీసింది. ఇదిలాఉండగా, ఎస్ఐ, కానిస్టేబుల్పై పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయా లేక వీఆర్కు అటాచ్ చేసి చేతులు దులుపుకొంటారా అనేది త్వరలో తేలనుంది.
జాతర, ఇతర వ్యాపారులతో వసూళ్లకు పాల్పడిన సిబ్బంది
డబ్బు పంపకాల్లో రాజుకున్న వివాదం.. ఉన్నతాధికారులకు సమాచారం
ఎస్ఐ, కానిస్టేబుల్ను వీఆర్కు అటాచ్
చేయని తప్పుకు బాధ్యుడిని చేశారని.. సూసైడ్ చేసుకుంటానంటూ కానిస్టేబుల్ పోస్టు వైరల్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
