
రైతులకు అండగా ఉంటాం
ధరూరు: యాసంగిలో వరి ధాన్యం పండించి కొనుగోలు సెంటర్కు తీసుకువచ్చిన ప్రతి రైతుకు అండగా ఉంటామని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే బండ్ల కష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని ఐకేపీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్ను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుకున్నారు. గన్నీ బ్యాగుల కొరత కారణంగా వారాల తరబడిగా ధాన్యం తీసుకువచ్చి ఇబ్బంది పడుతున్నామని రైతులు వివరించగా.. ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే గన్నీ బ్యాగులు పంపించి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. ఆదివారం కురిసిన వానకు కొంత వరకు ధాన్యం తడిసిందని, బ్యాగులు త్వరగా అందిస్తే తమకు ఇబ్బంది ఉండదని రైతులు వాపోయారు. అకాల వర్షంతో మండలంలో మామిడి తోటలు, మునగ ఇతర పంటలు సాగు చేసిన రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ.25 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోందని, ఇంకా ఎక్కడెక్కడ రైతులు నష్టపోయారో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించి వారి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. అకాల వర్షాలు, ఉరుముల కారణంగా మూగ జీవాలు మృతిచెందాయని, ఈ విషయాన్ని సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ హనుమంతు, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రాజశేఖర్, రామకృష్ణ నాయుడు, శ్రీనివాస్రెడ్డి, రాములు, ఉరుకుందు, ఏకేపీ ఏపీఎం శోభారాణి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.