రైతుకు గుర్తింపు.. | - | Sakshi
Sakshi News home page

రైతుకు గుర్తింపు..

May 4 2025 6:57 AM | Updated on May 4 2025 6:57 AM

రైతుక

రైతుకు గుర్తింపు..

ఆధార్‌ తరహాలో 11 అంకెల సంఖ్య

కాటారం: అన్నదాతలకు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో పొందుపర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలా ఆధార్‌కార్డు తరహాలో భూధార్‌ కార్డు జారీకి కేంద్రం శ్రీకారం చుట్టింది. 11 నంబర్లతో కూడిన ప్రత్యేకంగా రూపొందించిన భూధార్‌కార్డు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 5నుంచి 15 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే భూధార్‌కార్డుల జారీకి అవసరమైన వివరాల సేకరణకు సంబంధించి వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏఈఓలకు తగు సూచనలు చేశారు.

రైతు సమగ్ర సమాచారం ఒకే చోట..

రైతులకు సంబంధించిన సమగ్ర వివరాలను ఒకే చోట ఉండేలా నూతన విధానానికి కేంద్రం సంకల్పించింది. దేశ పౌరులకు ఆధార్‌కార్డు మాదిరిగా రైతులకు భూధార్‌ కార్డులతో గుర్తింపు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేసింది. రైతుకు సంబంధించిన భూ కమతానికి 11 అంకెలతో కూడిన విశిష్ట సంఖ్య(యూనిక్‌ కోడ్‌)ను కేటాయించనున్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్‌ చేసే క్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుట్టింది. గత ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని వ్యవసాయశాఖ కార్యాలయంలో అన్ని జిల్లాల అధికారులకు శిక్షణ ఇచ్చారు. రైతులకు కేటాయించిన భూధార్‌కార్డు నంబర్‌ క్లిక్‌చేస్తే చాలు రైతు పేరు, ఇతర వివరాలు ఇట్టే తెలిసిపోతాయి. సర్వే నంబర్లు, రైతు స్వగ్రామం, భూమి ఏ ప్రాంతాల్లో ఎంత ఉంది, అది సారవంతమైనదేనా..? ఆ భూమి ఏ పంటలకు అనువైనది..దానిపై సదరు రైతుకు బ్యాంకు అప్పు ఎంత ఇవ్వొచ్చు అనే వివరాలు తెలుస్తాయి. అంతేకాకుండా సబ్సిడీ వ్యవసాయ పరికరాలు, రసాయన ఎరువులతో పాటు పీఎం సమ్మాన్‌ నిధి, పంటనష్ట పరిహారం తదితర పూర్తి వివరాలను అందులోనే పొందపరచనున్నారు. ఇక నుంచి బ్యాంకు రుణం కోసం పట్టా పాస్‌బుక్‌, ఇతర పత్రాలను రైతు అధికారులకు చూపించాల్సిన అవసరం ఉండదు. కేవలం రైతుకు కేటాయించిన 11 అంకెలనంబర్‌ను సదరు అధికారికి చెబితే సరిపోతుంది.

ఈ–ఫార్మర్‌ రిజిస్ట్రీ..

వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్‌ చేయాలనే ఉద్దేశంతో ప్రతి రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీచేయడం ద్వారా జాతీయ స్థాయిలో ఈ–ఫార్మర్‌ రిజిస్ట్రీని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్‌ ప్రాజెక్ట్‌గా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలో అమలులోకి తెచ్చిన ఈ విధానం విజయవంతం అయింది. దీంతో కేంద్రం దేశవ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో భూ యజమానులతో పాటు కౌలు రైతులకు సైతం వీటిని జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ అగ్రిస్టాక్‌ ప్రాజెక్టు పేరిట అమలు చేయబోతున్న ఈ ప్రాజెక్ట్‌ కోసం స్టేట్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌(ఎస్‌పీఎంయూ)ను ఏర్పాటు చేశారు. వెబ్‌ల్యాండ్‌ డాటా ఆధారంగా జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా రైతుల ఈ–ఫార్మర్‌ రిజిస్ట్రీని రూపొందిస్తారు.

భూధార్‌కార్డు ఉంటేనే..

జిల్లాలో పట్టాదారు పాస్‌ పుస్తకాలు కలిగిన ప్రతి రైతుకు ఈ ఫార్మర్‌ రిజిస్ట్రీ పూర్తి చేసి భూధార్‌కార్డులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ నెల 5 నుంచి 15 వరకు గ్రామాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు చేపట్టి రైతులకు భూధార్‌కార్డులపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్డుల ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను వ్యవసాయశాఖ అధికారులు వివరించనున్నారు. ఈ కార్డులు ఉంటేనే ఇక నుంచి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ డబ్బులు రైతులు పొందగలుగుతారు. రైతుకు సంబంధించిన ప్రతి వివరాలు కాగితాలు లేకుండానే ఆన్‌లైన్‌లో చూసుకోవడానికి కార్డు నంబర్‌ ఉపయోగపడుతుంది.

ప్రతీ రైతుకు భూధార్‌కార్డు..

జిల్లాలోని ప్రతి రైతుకు భూధార్‌కార్డు ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నాం. రైతువేదికల వద్ద వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది రైతులకు సంబంధించిన వివరాలు సేకరించి ఈ ఫార్మర్‌ రిజిస్ట్రీలో పొందుపరుస్తారు. ఇప్పటికే ఉన్నతాధికారులు ఈ–ఫార్మర్‌ రిజిస్ట్రీకి సంబంధించి ఏఓ, ఏఈఓలకు అవగాహన కల్పించారు. ఈ నెల 5నుంచి 15వరకు దీనిపై ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది.

– వీరూనాయక్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

అందుబాటులోకి ప్రత్యేక యాప్‌

పీఎం కిసాన్‌ సమ్మాన్‌కు

ఈ కార్డు తప్పనిసరి

గ్రామాల్లో రైతు వేదికల వద్ద వివరాలు నమోదు

రైతుకు గుర్తింపు..1
1/1

రైతుకు గుర్తింపు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement