
పేద విద్యార్థి చదువుకు ఆర్థికసాయం
ధర్మపురి: తల్లిదండ్రులను కోల్పోయిన ఓ నిరుపేద విద్యార్థిని బాసరలో ట్రిపుల్ ఐటీ చదువుకునేందుకు అయ్యే ఖర్చును భరించడానికి పలువురు ముందుకొచ్చారు. బీర్పూర్ మండలకేంద్రానికి చెందిన గుండ నందిని బాసరలోని ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతోంది. తల్లిండ్రులు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. ఈ విషయాన్ని బీర్పూర్ పాఠశాల పూర్వ విద్యార్థులు స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రాం కన్వీనర్ గొల్లపెల్లి గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు విద్యార్థి దత్తత కార్యక్రమం కింద దత్తత తీసుకున్నారు. ధర్మపురికి చెందిన ఎన్నారైలు కొరిడె ఈశ్వర్, కొరిడె సాయి నందిని చదువు కోసం రూ.15వేల చొప్పున ఐదేళ్లపాటు చెల్లించేందుకు ముందుకొచ్చారు. మొదటి ఏడాదికి గాను రూ.15 వేలను ఎంఈవో సీతామహాలక్ష్మి చేతులమీదుగా అందించారు. దాతలకు, కన్వీనర్ గణేష్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పెండ్యాల మహేందర్, బీర్పూర్ పీడీ మంజుల ధరణి, ఉపాధ్యాయులు నర్సింహమూర్తి తదితరులున్నారు.