
శాతవాహనలో న్యాయ విద్య
కరీంనగర్క్రైం: లా చదవాలనే విద్యార్థులు కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ న్యాయ కళాశాల లేకపోవడంతో చాలా ఇబ్బందులుపడ్డారు. కాగా, ఇటీవల శాతవాహన యూనివర్సిటీకి న్యాయ కళాశాల మంజూరు కావడంతో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
బీసీఐ నుంచి గ్రీన్లిగ్నల్
దేశవ్యాప్తంగా ఎక్కడ లా కళాశాల ఏర్పాటు చేయాలన్నా స్థానిక ప్రభుత్వ అనుమతితో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) అనుమతి కీలకం. ఈనేపథ్యంలో శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలని 11 నవంబర్ 2024న వైస్ చాన్స్లర్ నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈక్రమంలో శాతవాహనలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం తరగతులు నిర్వహించేందుకు ఫిబ్రవరి 2025లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు జారీ చేసింది. దీంతో ఎల్ఎల్బీ తరగతులకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. న్యాయకళాశాల భవన నిర్మాణం, ఇతరత్రా అవసరాలకు సుమారు రూ.22 కోట్లు మంజూరయ్యాయి. భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలికంగా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలోని మొదటి అంతస్తులో తరగతులు నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల టీచింగ్, నాన్టీచింగ్ కోసం 35 పోస్టులు అవసరం ఉండడంతో వీటి కేటాయింపునకు కేబినెట్లో ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. కేబినెట్ సమావేశం కాగానే పోస్టుల భర్తీ జరుగుతుందని యూనివర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి.
పట్టా చేతిలో ఉంటే పుట్టెడు మార్గాలు
ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పట్టా చేతిలో ఉంటే ఉపాధికి పుట్టెడు మార్గాలుంటాయి. సొంతంగా ఎవరి మీద ఆధారపడకుండా లా ప్రాక్టిస్ చేసుకోవడంతో పాటు వివిధ కంపెనీలకు లీగల్ అడ్వైజర్లుగా ఉండడం, జిల్లా జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు, ఇవే కాకుండా ఇతర శాఖల్లో కూడా లా చదివిన వారిని వివిధ కమిషన్ మెంబర్లు, కమిటీ మెంబర్లుగా నియమితులయ్యే అవకాశాలున్నాయి. ఎల్ఎల్ఎం చేసిన వారు ఎల్ఎల్బీ తరగతులు చెప్పడంతోపాటు ఇతర అవకాశాలు ఉండడంతో చాలా మంది న్యాయవిద్యపై ఆసక్తి చూపిస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీ వ్యాప్తంగా లా కాలేజీలు రెండు మాత్రమే అవి కూడా ప్రైవేట్ కళాశాలలు మాత్రమే నడిపిస్తున్నాయి. ఇప్పుడు ఎస్యూలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటు కావడంతో ఇక్కడి ప్రాంత విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందని విద్యార్థి సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది.
ఎల్ఎల్బీలో 120, ఎల్ఎల్ఎం 20 సీట్లు
రూ.22కోట్లతో భవన నిర్మాణ, మౌలిక సదుపాయాలు
త్వరలో 35 మంది టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్
ఈ అకడమిక్ నుంచి తరగతులు ప్రారంభం
కోర్సు సెక్షన్లు సీట్లు
ఎల్ఎల్బీ 2 120
ఎల్ఎల్ఎం 1 20
ఈ సంవత్సరం నుంచి తరగతులు
శాతవాహన యూనివర్సిటీకి న్యాయ కళాశాల మంజూరైంది. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతానికి ఆర్ట్స్ కళాశాలలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభిస్తున్నాం. భవనాలు నిర్మించిన తర్వాత శాశ్వతంగా ప్రత్యేక వసతి సౌకర్యాలు ఉంటాయి.
– ప్రొఫెసర్ ఉమేశ్కుమార్, శాతవాహన వీసీ

శాతవాహనలో న్యాయ విద్య