
రోళ్లవాగు ఆయకట్టుకు నీరందిస్తాం
● మాజీ మంత్రి జీవన్రెడ్డి
సారంగాపూర్(జగిత్యాల): రోళ్లవాగు ప్రాజెక్టు దిగువన ఖరీఫ్ పంటలకు పూర్తిస్థాయిలో నీరందిస్తామని మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. ఆదివారం బీర్పూర్ శివారుల్లోని రోళ్లవాగు ప్రాజెక్టు పనులను అధికారులు, రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2015–16 సంవత్సరంలో రోళ్లవాగు ఆధునీకరణ పనులు ప్రారంభించినా ఇంజినీరింగ్, అటవీశాఖల మధ్య సమన్వయంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగి ప్రాజెక్టు వ్యయం రూ.60 కోట్ల నుంచి రూ.152 కోట్లకు చేరిందన్నారు. అయినా పనులు పూర్తి కాలేదని, అటవీశాఖ అనుమతులను కూడా సాధించలేకపోయారని విమర్శించారు. తాను సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ప్రాజెక్టుకు అదనంగా మరో రూ.20 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. రోళ్లవాగుకు మూడు షటర్స్ బిగించి, 0.25 టీఎంసీల నీరు నిల్వ ఉంచేలా అధికారులు షటర్స్ బిగింపు పనులు ప్రారంభించినట్లు వివరించారు. అటవీశాఖ అనుమతులు వచ్చే వరకు ఆ శాఖ భూములకు నీరు చేరకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బీర్పూర్, ధర్మపురి మండలాల్లోని పంటలు ఎండకుండా నీరందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట విండో చైర్మన్ పొల్సాని నవీన్రావు, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్, పార్టీ మండల అధ్యక్షుడు చెర్పూరి సుభాష్, గుడిసె జితేందర్, ఆడెపు తిరుపతి, రంగు లక్ష్మణ్, పంజాల అఖిల్, బర్ల లక్ష్మీనారాయణ, చెట్ల శేఖర్, ఏనుగు జోగిరెడ్డి, కమ్మునూర్ శ్రీను తదితరులు ఉన్నారు.