
కోరుట్లకు ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డు
కోరుట్ల: కోరుట్ల మున్సిపాలిటీకి టీజీపీసీబీ ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డు అందించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురువారం ఈ అవార్డును మున్సిపల్ కమిషనర్ అందె మారుతీ ప్రసాద్కు అందజేసింది. మంత్రి కొండా సురేఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గుగ్లావత్ రవి అవార్డును అందించారు. మున్సిపల్ కమిషనర్ అందె మారుతీ ప్రసాద్ మాట్లాడుతూ.. పట్టణంలో చెత్తసేకరణ, వెహికిల్ ట్రాకింగ్ సిస్టం, తడి,పొడి చెత్తతో ఎరువు తయారీ, డీఆర్సీసీ సెంటర్ ద్వారా తడి, పొడి చెత్త వేరు చేయటం, పర్యావరణానికి హాని కలుగకుండా ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిని గుర్తించి అవార్డుకు ఎంపిక చేసిందని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్న పట్టణ ప్రజలకు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.