యాసంగిలో ‘పంట పండింది’ | - | Sakshi
Sakshi News home page

యాసంగిలో ‘పంట పండింది’

Jun 8 2025 12:58 AM | Updated on Jun 8 2025 12:58 AM

యాసంగ

యాసంగిలో ‘పంట పండింది’

● రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి ● వాతావరణ పరిస్థితులే అంటున్న శాస్త్రవేత్తలు

జగిత్యాలఅగ్రికల్చర్‌: యాసంగి సీజన్‌లో జిల్లాలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి అయ్యింది. రాష్ట్రస్థాయిలో జిల్లా మూడోస్థానంలో నిలిచింది. వరి సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు జిల్లాలో ఉండటంతో సగటున రైతులు ఎకరాకు 23 క్వింటాళ్ల దిగుబడి సాధించినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు.

మూడు లక్షల ఎకరాల్లో వరి సాగు

జిల్లాలో సుమారు మూడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడం.. బావులు, బోర్లు, కుంటలు, చెరువులకు తోడు ఎస్సారెస్పీ నుంచి నీరు విడుదల కావడంతో వరి సాగు అధికంగా చేపట్టి మంచి దిగుబడి తీశారు. మరోవైపు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం పెద్దగా లేకపోవడం.. తేమ శాతం పెరగకపోవడం రైతులకు కలిసి వచ్చింది. పంట చివరి దశలో అకాలవర్షాలు కురిసినప్పటికీ పెద్దగా నష్టం జరగలేదు. జగిత్యాల రూరల్‌, గొల్లపల్లి, రాయికల్‌, సారంగాపూర్‌ వంటి మండలాల్లో కొంతమంది రైతులు ఎకరాకు 28 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి తీశారు.

69లక్షల క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి

మూడు లక్షల ఎకరాల్లో పంట సాగు చేసిన రైతులు 69 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి చేశారు. 367 కొనుగోలు కేంద్రాల ద్వారా 46.36 లక్షల క్వింటాళ్ల సన్న, దొడ్డు రకాలు కొన్నారు. ప్రైవేట్‌ సీడ్‌ కంపెనీలు విత్తనోత్పత్తి చేయించి.. మరో రెండు లక్షల క్వింటాళ్లు కొన్నాయి. కేంద్రాల ప్రారంభానికి ముందు అకాల వర్షాలు కురవడంతో అప్పటికే కోతలు పూర్తి చేసిన రైతులు దాదాపు 20లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు అమ్ముకున్నట్లు సమాచారం. ఒక్కో రైస్‌మిల్లరు తమ ఆర్థిక స్థితిని బట్టి దాదాపు 20వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

రూ.1600 కోట్ల పంట.. పెరిగిన ఖర్చు

జిల్లాలో సాగు నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో వానాకాలం, యాసంగి సీజన్లలో వరి పండిస్తారు. వానాకాలంతో పోల్చితే యాసంగిలో దిగుబడి ఎక్కువగా ఉంటాయి. ఈ యాసంగిలో రైతులు వరి పండించి రూ.1600కోట్ల ధాన్యం విక్రయించారు. మరోవైపు ఖర్చులు కూడా భారీగానే పెరిగాయి. నాట్ల సమయంలో ఒక్కో మహిళా కూలీకి రూ.500 నుంచి రూ.600, మగ మనిషికి రూ.800 నుంచి రూ.వెయ్యికి చేరాయి. ట్రాక్టర్‌తో దున్నడానికి ఎకరాకు రూ.5 నుంచి రూ.6వేలు అవుతోంది. రసాయన, క్రిమిసంహారక మందులకు ఎకరాకు రూ.పదివేల వరకు అవుతోంది. హార్వెస్టర్‌కు రూ.3వేలు చెల్లించాల్సి వస్తోంది. అన్ని ఖర్చులు పోను మిగిలిన ఆదాయంతోనే రైతులు బ్యాంకుల్లో తీసుకున్న అప్పు చెల్లించడం.. పిల్లలను చదివించడం.. వైద్యఖర్చులు భరించాల్సి వస్తోంది. దీనికి ఏటా అప్పు చేయాల్సి వస్తోంది. పంట పండుతున్నా తిరిగి అప్పు చేయాల్సి రావడంతో కొందరు భూములను అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.

దిగుబడి వస్తోంది

ప్రతి సీజన్‌లో రెండుమూడెకరాల్లో వరి సాగు చేస్తాను. మంచి దిగుబది వస్తోంది. ఖర్చులు పెరగడం, మద్దతు ధర అంతంతే ఉండటంతో పెద్దగా లాభం ఉండటం లేదు. ఇతర పంటల వైపు మళ్లలేక వరి సాగు చేస్తున్నాను.

– మహేందర్‌ రెడ్డి, తొంబర్రావుపేట

అనువైన వాతావరణం

జిల్లాలో వరి సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులున్నాయి. ఇతర జిల్లాలతో పోల్చితే ఒకట్రెండు క్వింటాళ్లు ఎక్కువ పండుతుంది. కొన్ని కంపెనీలు విత్తనోత్పత్తి చేయిస్తున్నాయి. ఖర్చులు తగ్గించడంపై రైతులు దృష్టి పెట్టాలి.

– శ్రీలత, వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్‌

యాసంగిలో ‘పంట పండింది’1
1/2

యాసంగిలో ‘పంట పండింది’

యాసంగిలో ‘పంట పండింది’2
2/2

యాసంగిలో ‘పంట పండింది’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement